Ratan Tata : విశ్వ విఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన దేశంలో టాటా గ్రూప్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. రతన్ టాటాను అందరూ మనసున్న మారాజు అని కొనియాడుతుంటారు. మనుషులపైనే కాదు.. మూగ జీవాలపైనా ఆయన ప్రేమను చూపుతుంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా రతన్ టాటా ఓ పోస్టు పెట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న 7 నెలల వయసున్న వీధి కుక్కకు ప్రస్తుతం ముంబైలోని టాటా గ్రూపునకు చెందిన పెంపుడు జంతువుల ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అయితే అది వేగంగా కోలుకోవడం లేదు. ఆ కుక్క రక్తహీనత సమస్యతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న రతన్ టాటా(Ratan Tata).. ఆ వీధికుక్కను కాపాడేందుకు సహాయం చేయాలని ముంబై వాసులకు పిలుపునిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఏడు నెలల కుక్క ఎనీమియాతో బాధ పడుతోంది. దానికి ముంబైలోని మా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. దాన్ని కాపాడేందుకు మా సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. కానీ చికిత్స కోసం ఆ కుక్కకు రక్తం అవసరం. ముంబై వాసులారా దయచేసి సాయం చేయండి. మీ ఏరియాలోని పూర్తి ఆరోగ్యంతో ఉన్న కుక్క నుంచి రక్తాన్ని దానం చేయండి. మీరు సాయం చేస్తారని ఆశిస్తున్నా’’ అని రతన్టాటా తన పోస్టులో పేర్కొన్నారు.
తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో బాధిత కుక్కను ఫొటోను రతన్ టాటా షేర్ చేశారు. ఈ కుక్కకు రక్తం ఇవ్వబోయే కుక్క ఆరోగ్యపరంగా ఎలా ఉండాలనేది ఆ పోస్టులో రతన్ టాటా వివరించారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. వీధికుక్క కోసం ఇంతగా ఆలోచిస్తూ.. ప్రజలను సాయం కోరుతున్న రతన్ టాటాపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా, రతన్ టాటాకు మూగ జీవాలంటే చాలా ప్రేమ. అందుకే ఆయన ముంబైలో మూగజీవాల కోసం ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించారు.