Income Tax: మీరు ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత రిఫండ్ కోసం ఎదురుచూడటం సహజం. అయితే ఈ నిరీక్షణ సమయంలో అకస్మాత్తుగా మీ మొబైల్కు “మీ రిఫండ్ ఆగిపోయింది. వెంటనే ఈ పని చేయండి” అని మెసేజ్ వస్తే ఆందోళన కలగడం సహజం. కానీ ఈ ఆందోళనే సైబర్ నేరగాళ్లకు అతిపెద్ద ఆయుధంగా మారుతోంది. గత కొంతకాలంగా రిఫండ్ ఆలస్యంపై ఆన్లైన్లో ఫిర్యాదులు పెరుగుతుండటాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.
రిఫండ్ ఎందుకు ఆలస్యం అవుతుంది?
ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) స్పష్టం చేసిన దాని ప్రకారం.. వెరిఫికేషన్, డేటా మ్యాచింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాతే రిఫండ్ జారీ చేయబడుతుంది. డేటాలో ఏవైనా తేడాలు ఉన్నా లేదా అక్రమాలు జరిగినట్లు అనుమానం వచ్చినా ప్రక్రియ ఆలస్యం కావచ్చు. సాధారణంగా కొన్ని వారాల్లోనే రిఫండ్ ప్రాసెస్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అదనపు తనిఖీలు అవసరమవుతాయి. ఈ అనిశ్చయతనే మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
Also Read: ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!
మోసం ఎలా జరుగుతోంది?
- సైబర్ నేరగాళ్లు నకిలీ SMS, ఈమెయిల్, ఫోన్ కాల్స్ ద్వారా మీ రిఫండ్ పెండింగ్లో ఉందని నమ్మిస్తారు.
- ఆ మెసేజ్లలో ఒక అనుమానాస్పద లింక్ ఇచ్చి, వెంటనే స్పందించకపోతే పెనాల్టీ పడుతుందని భయపెడతారు.
- ఇటీవల ఒక టాక్స్పేయర్ ఇలాంటి లింక్ను క్లిక్ చేసి తన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల సుమారు రూ. 1.5 లక్షల రూపాయలు నష్టపోయారు.
ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక
ఈ వరుస సంఘటనల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ప్రజలను హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని లింక్లను క్లిక్ చేయవద్దని, బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సూచించింది.
సురక్షితంగా ఉండటం ఎలా?
అధికారిక పోర్టల్: కేవలం ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారానే లాగిన్ అవ్వండి.
లింక్ల పట్ల జాగ్రత్త: గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్లలోని లింక్లను క్లిక్ చేయకండి.
స్టేటస్ చెక్: రిఫండ్ స్టేటస్ను కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే తనిఖీ చేయండి.
ఆందోళన వద్దు: భయం లేదా ఆందోళనలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
రిపోర్ట్ చేయండి: అనుమానాస్పద మెసేజ్ల గురించి ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేయండి.
