భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధ‌ర‌లు?!

వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే దేశ జీడీపీ (GDP)పై తీవ్ర ప్రభావం పడుతుంది.

Published By: HashtagU Telugu Desk
Oil Price Shock

Oil Price Shock

Oil Price Shock: గత కొన్ని రోజులుగా మీరు ఎల్పీజీ బుకింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నా, పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చినా.. ‘ఇంతకంటే దారుణం ఏముంటుందిలే’ అని మీరు అనుకుంటే పొరపాటే. అమెరికా ఇరాన్‌కు చెందిన ఖార్గ్ ద్వీపంపై దాడి చేయగా దీనిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తీవ్రస్థాయిలో స్పందించింది. ఖార్గ్ ద్వీపంపై దాడులు జరిగితే మిడిల్ ఈస్ట్‌లోని చమురు నిల్వలన్నింటినీ తగులబెట్టేస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా చమురు ధర బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరుకుంటుందని ఇరాన్ హెచ్చరించింది. 200 డాలర్లు అంటే.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మొదలవ్వకముందు (ఫిబ్రవరి 27) ఉన్న ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల‌ మధ్య తక్షణమే కాల్పుల విరమణ జరగకపోతే ప్రపంచవ్యాప్తంగా పెను సంక్షోభం తప్పేలా లేదు. ఒకవేళ ఈరోజే యుద్ధం ముగిసినా చమురు సరఫరా సాధారణ స్థితికి రావడానికి చాలా వారాల సమయం పట్టేలా ఉంది. ముడిచమురు ధర 200 డాలర్లకు చేరితే కలిగే పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం ముడిచమురు ధర ఎంత ఉంది?

ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 106.50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం ప్రారంభానికి ఒక రోజు ముందు (ఫిబ్రవరి 27న) ఇది కేవలం 72.48 డాలర్లు మాత్రమే. గత సోమవారం ఇది 120 డాలర్ల వరకు వెళ్లింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. హార్ముజ్ జలసంధి బయట ఉన్న ఒక టెర్మినల్ నుండి విక్రయించబడే ఒమానీ క్రూడ్ 51 డాలర్ల ప్రీమియంతో అమ్ముడవుతోంది. అంటే దీని ప్రభావవంతమైన ధర బ్యారెల్‌కు 150 డాలర్ల కంటే ఎక్కువే. ఫిబ్రవరిలో ఇది కేవలం 75 సెంట్ల ప్రీమియంతో మాత్రమే లభించేది. అదేవిధంగా దుబాయ్ క్రూడ్ కూడా 56 డాలర్ల ప్రీమియంతో విక్రయించబడుతోంది.

Also Read: రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా? లేదా?!

హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం

యుద్ధానికి ముందు ప్రతిరోజూ సుమారు 138 ఓడలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేవి. ప్రస్తుతం ఇరాన్.. భారత్, చైనా, పాకిస్థాన్ వంటి కొన్ని దేశాల ఓడలకు మాత్రమే అనుమతినిస్తోంది. ఇప్పుడు రోజుకు కేవలం 4-5 ఓడలు మాత్రమే ఇక్కడి నుండి వెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్త రోజువారీ సరఫరాలో 20 శాతం (దాదాపు 20 మిలియన్ బ్యారెల్స్) ఈ జలసంధి గుండానే జరుగుతుంది. అంటే గత 18 రోజులుగా సుమారు 360 మిలియన్ బ్యారెల్స్ చమురు సరఫరా నిలిచిపోయింది. యుద్ధం పొడిగించే కొద్దీ ప్రపంచ దేశాల చమురు నిల్వలు అడుగంటుతున్నాయి.

ధర 200 డాలర్లకు చేరుతుందా?

జెట్ ఫ్యూయల్ ఇప్పటికే బ్యారెల్‌కు 190 డాలర్ల వద్ద లభిస్తోందని రాయిటర్స్ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ముడిచమురు ధర 200 డాలర్లకు చేరుకోవడం అసాధ్యమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది? హార్ముజ్ జలసంధి ఎన్ని రోజులు మూసివేసి ఉంటుంది అనే దానిపైనే ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ ‘వుడ్ మెకెంజీ’ వెల్లడించింది.

ధర 200 డాలర్లకు చేరితే ఏం జరుగుతుంది?

చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం సామాన్యుడిపై నేరుగా పడుతుంది.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్: వీటి ధరలు భారీగా పెరుగుతాయి.

రవాణా ఖర్చులు: విమాన టిక్కెట్లు, రవాణా ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.

ద్రవ్యోల్బణం: వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే దేశ జీడీపీ (GDP)పై తీవ్ర ప్రభావం పడుతుంది.

  Last Updated: 18 Mar 2026, 04:35 PM IST