అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (MACT) నుండి వచ్చే పరిహారంపై లభించే వడ్డీని ఇప్పుడు పూర్తిగా పన్ను రహితం చేశారు.

Published By: HashtagU Telugu Desk
New IT Rules

New IT Rules

New IT Rules: దేశంలో ఈరోజు అంటే ఏప్రిల్ 1 నుండి పన్ను నిబంధనలలో కీలక మార్పులు అమలులోకి వచ్చాయి. దీని ప్రభావం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారితో పాటు ఇతరులపై కూడా పడనుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న 1961 పాత ఆదాయపు పన్ను చట్టాన్ని తొలగించి, దాని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులోకి వచ్చింది.

ఈ మార్పు వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం నిబంధనలను మరింత సరళంగా, అర్థమయ్యేలా చేయడమే. తద్వారా పన్ను చెల్లింపుదారులు ఎటువంటి గందరగోళం లేకుండా నిబంధనలను పాటించవచ్చు. ఆ కీలక మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్ను వ్యవస్థ మరింత సరళం

కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను నిబంధనల కోసం సామాన్యులకు కూడా అర్థమయ్యేలా సులభమైన భాషను ఉపయోగించనున్నారు. దీనితో పాటు, గతంలో ఉన్న ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే విభిన్న వ్యవస్థలను తొలగించి ఇప్పుడు ఒకే రకమైన ‘టాక్స్ ఇయర్’ను అమలు చేశారు. అంటే ఏ సంవత్సరంలో ఆదాయం వస్తుందో, ఆ సంవత్సరాన్నే నేరుగా పన్ను కోసం పరిగణిస్తారు. అంతేకాకుండా పన్ను చెల్లించని వారు విడిగా ఫారమ్‌లు నింపాల్సిన అవసరాన్ని కూడా తొలగించారు దీనివల్ల ప్రక్రియ గతంలో కంటే చాలా సులభతరం అయింది.

Also Read: ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్.. రెండో మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే?

గిఫ్ట్‌లు, వోచర్‌లపై పెరిగిన పన్ను మినహాయింపు

కంపెనీల నుండి లభించే గిఫ్ట్ కార్డ్‌లు, వోచర్‌లు, కూపన్‌లపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచారు. గతంలో ఏడాదికి రూ. 5,000 గా ఉన్న ఈ పరిమితిని ఇప్పుడు రూ. 15,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విశేషమేమిటంటే.. ఈ మినహాయింపు పాత, కొత్త పన్ను విధానాలు రెండింటిలోనూ వర్తిస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

పరిహారంపై వచ్చే వడ్డీకి పన్ను నుండి ఊరట

మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (MACT) నుండి వచ్చే పరిహారంపై లభించే వడ్డీని ఇప్పుడు పూర్తిగా పన్ను రహితం చేశారు. అంటే ఈ మొత్తంపై ఎలాంటి పన్ను కోత ఉండదు. దీనివల్ల బాధిత వ్యక్తులకు పూర్తి స్థాయి ప్రయోజనం లభిస్తుంది.

క్రెడిట్ కార్డ్ ఖర్చులపై నిఘా పెంపు

ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే భారీ ఖర్చుల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆన్‌లైన్ లావాదేవీలు, రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు ఖర్చు చేస్తే ఆ వివరాలను విభాగానికి వెల్లడించాలి.

HRA క్లెయిమ్ నిబంధనలు కఠినం

ఇంటి అద్దె భత్యం నిబంధనలలో మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. నకిలీ రశీదుల ద్వారా పన్ను ఆదా చేయడం ఇకపై సులభం కాదు. ఉద్యోగులు అద్దెకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. దీని కోసం ఇంటి యజమాని PAN నంబర్ పంచుకోవడం తప్పనిసరి. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో వారి పూర్తి వివరాలను కూడా అడగవచ్చు. దీనితో పాటు బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్‌లను మెట్రో నగరాల జాబితాలో చేర్చారు. ఇక్కడ ఇప్పుడు HRAపై 50 శాతం వరకు మినహాయింపు లభిస్తుంది. ఇది గతంలో 40 శాతంగా ఉండేది.

  Last Updated: 01 Apr 2026, 06:02 PM IST