50 ఏళ్లు పూర్తి చేసుకున్న మ్యాగీ

భారతదేశంలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, నెస్లే ఇండియా తన ప్రసిద్ధ బ్రాండ్ మ్యాగీ (MAGGI) పేరుతో ఒక ప్రత్యేక స్మారక తపాలా స్టాంపును విడుదల చేసింది

Published By: HashtagU Telugu Desk
Magi 50 Yrs

Magi 50 Yrs

Nestle India Celebrates Maggi’s 50-year Journey : భారతదేశంలో మ్యాగీ ప్రయాణం కేవలం ఒక రుచికరమైన ఆహారంగానే కాకుండా, కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో ఒక విడదీయలేని అనుబంధంగా మారిపోయింది. 50 ఏళ్ల ఈ అద్భుత ప్రయాణాన్ని పురస్కరించుకుని స్మారక తపాలా స్టాంపు ను విడుదల చేసారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, నెస్లే ఇండియా సీఎండీ మనీష్ తివారీ కలిసి ఈ స్టాంపును ఆవిష్కరించారు. ఒక ప్రైవేట్ బ్రాండ్ తరతరాలుగా ప్రజల జీవితాల్లో మమేకమై, దేశ ఆహార సంస్కృతిలో ఒక భాగమైనందుకు గుర్తుగా ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది. ఇది కేవలం ఒక ఉత్పత్తి విజయం మాత్రమే కాదు, ఐదు దశాబ్దాల పాటు లక్షలాది గృహాలలో నిలిచిన నమ్మకానికి అధికారిక గుర్తింపు.

గత 50 ఏళ్లుగా మ్యాగీ భారతీయ ఇళ్లలోకి అనేక రూపాల్లో ప్రవేశించింది. కేవలం ‘2 మినిట్స్’ నూడుల్స్‌గానే కాకుండా మసాలాలు, సాస్‌లు మరియు సూప్‌ల రూపంలో వంటగదిలో ముఖ్యపాత్ర పోషించింది. హాస్టల్ గదుల్లో అర్ధరాత్రి ఆకలి తీర్చే నేస్తం నుండి, వర్షం పడే వేళ కుటుంబమంతా కలిసి ఆస్వాదించే వేడి వేడి భోజనం వరకు మ్యాగీ ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. “50 ఏళ్ల కలిసికట్టుగా” (50 Years of Togetherness) అనే థీమ్‌తో వచ్చిన ఈ స్టాంప్, మ్యాగీ మన దేశవ్యాప్తంగా టేబుల్‌లపైకి తీసుకువచ్చిన వెచ్చదనం, సౌకర్యం మరియు బలమైన బంధాలకు నివాళిగా నిలుస్తుంది.

Maggi

ఈ వేడుకలో పాల్గొన్న మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ, భారత ఆహార శుద్ధి రంగంలో మ్యాగీ వంటి బ్రాండ్‌లు కొత్త ఒరవడిని సృష్టించాయని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో ఇవి మార్గదర్శకంగా నిలిచాయని కొనియాడారు. నెస్లే ఇండియా చైర్మన్ మనీష్ తివారీ ఈ మైలురాయిని ఒక అపురూపమైన ప్రయాణంగా అభివర్ణించారు. మారుతున్న భారతీయుల అభిరుచులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు చేస్తూనే, దేశవ్యాప్తంగా ఐక్యతను మరియు రుచిని అందిస్తూ భవిష్యత్తులోనూ ప్రజల జీవితాల్లో భాగం కావడానికి నెస్లే ఇండియా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

  Last Updated: 05 Feb 2026, 09:04 PM IST