Muhurat Trading: ఈ రోజు (మంగళవారం) బీఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE) రెండింటిలోనూ దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించే ఒక గంట ముహూర్త ట్రేడింగ్ (Muhurat Trading) సెషన్ మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 300 పాయింట్లు పెరిగి, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,900 స్థాయిని అధిగమించి ఓపెన్ అయ్యాయి. అయితే ఆ తర్వాత మార్కెట్లో కొంత తగ్గుదల కనిపించింది. మధ్యాహ్నం 1:55 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 190 పాయింట్లు పెరిగి 84,552.82 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 25,900 పైన 25,906.25 వద్ద ట్రేడ్ అవుతూ కనిపించాయి.
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్
ఒక గంట ముహూర్త ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 2:45 గంటలకు స్వల్ప లాభాలతో ముగిసింది. దీనితో కొత్త సంవత్సరం సంవత్ 2082కి సానుకూల (పాజిటివ్) ప్రారంభం లభించినట్లైంది. వ్యాపారం ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 62.97 పాయింట్లు లేదా 0.07 శాతం లాభంతో 84,426.34 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 25.45 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 25,850 స్థాయిని దాటింది.
Also Read: Delhi Air Quality: ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యపు పొగ.. ‘రెడ్ జోన్’లో గాలి నాణ్యత!
లాభపడిన షేర్లు ఇవే
నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన షేర్లలో సిప్లా (Cipla), బజాజ్ ఫిన్సర్వ్ (Bajaj Finserv), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఇన్ఫోసిస్ (Infosys), మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ఉన్నాయి. నష్టపోయిన షేర్లలో కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel), మ్యాక్స్ హెల్త్కేర్ (Max Healthcare), ఏషియన్ పెయింట్స్ (Asian Paints) ఉన్నాయి. అన్ని సెక్టోరల్ ఇండెక్స్లు లాభాలతో ముగిశాయి. వీటిలో మెటల్, మీడియా, ఎనర్జీ, టెలికాం, హెల్త్ కేర్ రంగాలలో 0.5 శాతం పెరుగుదల నమోదైంది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 1 శాతం లాభపడ్డాయి.