UPI Transactions: మహారాష్ట్ర ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలో అత్యధిక యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI Transactions) లావాదేవీలను నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ కాలంలో ప్రతి నెలా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక శక్తి కేంద్రమైన మహారాష్ట్రను కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అనుసరిస్తున్నాయి. యూపీఐని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెబ్సైట్లో అత్యధికంగా యూపీఐ పేమెంట్స్ వాడే రాష్ట్రాల జాబితాను తాజాగా విడుదల చేసింది.
ఎన్పీసీఐ మొదటిసారిగా రాష్ట్రాల వారీగా వివరాలను ఇచ్చింది. టాప్ నాలుగు రాష్ట్రాలు మే నెలలో కలిపి ఒక బిలియన్ కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేశాయి. అయితే జూన్లో ఈ సంఖ్య తగ్గింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్ నెలకు రూ. 24 లక్షల కోట్లకు పైగా విలువైన లావాదేవీలను సాధిస్తుంది.
Also Read: Sreeleela : శ్రీలీల కెరీర్కి టర్నింగ్ పాయింట్ కావాలెప్పుడో..!
మే నెలలో మహారాష్ట్ర రూ. 3 లక్షల కోట్ల విలువైన లావాదేవీలను నమోదు చేసింది. ఆ తర్వాత కర్ణాటక దాదాపు రూ. 2 లక్షల కోట్లతో ఉంది. ఉత్తర్ ప్రదేశ్లో రూ. 1.8 లక్షల కోట్లు, తెలంగాణలో రూ. 1.75 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ర్యాంకింగ్లు ప్రధానంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద పట్టణ కేంద్రాల్లో జరగుతున్నాయి. ఇక్కడ మొబైల్, డిజిటల్ పేమెంట్లు చిన్న విలువ లావాదేవీలకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డేటా యూపీఐ యాప్ల నుండి సేకరించారు.
ఆర్థిక వ్యవస్థ, జనాభా
నేషనల్ క్యాపిటల్ రీజియన్ లావాదేవీల డేటా ఢిల్లీ, హరియాణా (గురుగ్రామ్), ఉత్తరప్రదేశ్ (నోయిడా) మధ్య విభజించబడింది. కాబట్టి ఇది టాప్ ఐదు రాష్ట్రాలలో చోటు చేసుకోలేదు. అయితే ఉత్తరప్రదేశ్ దాదాపు 25 కోట్ల జనాభాతో, మే నెలలో 7 శాతం కంటే ఎక్కువ వాల్యూమ్, విలువ మార్కెట్ వాటాతో మూడవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. మహారాష్ట్ర యూపీఐ లావాదేవీలలో దాదాపు 13 శాతం, కర్ణాటక దాదాపు 7.7 శాతం వాటాను కలిగి ఉంది. తెలంగాణ మొత్తం యూపీఐ లావాదేవీలలో 6 శాతం, తమిళనాడు దాదాపు 4 శాతం నమోదు చేసింది.
యూపీఐ వాడే టాప్ 10 రాష్ట్రాల జాబితా
- మహారాష్ట్ర
- కర్ణాటక
- ఉత్తరప్రదేశ్
- తెలంగాణ
- తమిళనాడు
- రాజస్థాన్
- మధ్యప్రదేశ్
- ఆంధ్రప్రదేశ్
- బీహార్
- ఢిల్లీ