అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి.. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీపై ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ సమయంలో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోగా.. ఎల్ఐసీకి అప్పుడు నష్టాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. అయితే ఎట్టకేలకు అదానీ గ్రూప్లో పెట్టుబడులకు సంబంధించి.. ఎల్ఐసీ స్పందించింది. ఇది తమ స్వతంత్ర నిర్ణయం అని.. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది.
ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద జీవిత బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కీలక ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ చేసిన పెట్టుబడులపై వస్తున్నటువంటి ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ పెట్టుబడులపై ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. ఇది తమ స్వతంత్ర నిర్ణయమేనని స్పష్టం చేసింది ఎల్ఐసీ. ఈ ఏడాది ప్రారంభంలో.. అప్పులు, అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సమయంలో.. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఒక కథనం వెలువరించింది. అందులో భాగంగా.. ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చిన ప్రణాళిక మేరకే ఎల్ఐసీ భారీగా పెట్టుబడి పెట్టిందని ఆరోపించింది.
ఈ ఆరోపణలపై తాజాగా స్పందించిన ఎల్ఐసీ దానిని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు దానికి బదులుగా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది. ఇక్కడ వాషింగ్టన్ పోస్ట్ కథనం పూర్తిగా నిరాధారం అని తెలిపింది. పెట్టుబడులపై తమదే తుది నిర్ణయం అని.. ఎల్ఐసీ బోర్డు ఆమోదించిన నిర్ణయాలకు అనుగుణంగానే.. తాము స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇంకా ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ.. ఇతర శాఖల ప్రమేయం గానీ లేదని ఎల్ఐసీ పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా.. అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న సంస్థపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికింది. అయితే ఈ క్రమంలోనే ఎల్ఐసీకి.. అదానీ గ్రూప్ కంపెనీలు సహా దేశంలోని ఇతర చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద మొత్తంలో వాటాలు ఉన్నట్లు తెలిసింది.
దేశంలోని టాప్- 500 కంపెనీల్లో పెట్టుబడులు కొనసాగిస్తోంది ఎల్ఐసీ. 2014లో ఈ పెట్టుబడుల విలువ రూ. 1.56 లక్షల కోట్లుగా ఉండగా.. అది 2025 నాటికి 10 రెట్లు పెరిగి రూ. 15.6 లక్షల కోట్లకు చేరడం విశేషం. ఇక్కడ అదానీ గ్రూప్లో 4 శాతం వాటా కలిగి ఉంది. దీని విలువ సుమారు రూ. 60 వేల కోట్లుగా ఉంది.
అదానీ గ్రూప్ మాత్రమే కాదు.. దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా టాటా గ్రూప్, ఐటీసీ ఇలా చాలా కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్లో 6.94 శాతం వాటాకు సమానమైన రూ. 1.34 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఐటీసీలో 15.86 శాతం (రూ. 82,800 కోట్లు), HDFC బ్యాంకులో రూ. 64,725 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 79,361 కోట్ల పెట్టుబడి ఉంది. ఇదే సమయంలో ఒక్క టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లోనే (TCS) 5.02 శాతం వాటాకు సమానమైన రూ. 5.7 లక్షల కోట్ల పెట్టుబడులు ఎల్ఐసీకి ఉండటం విశేషం.
