Petrol- Diesel: ఇరాన్పై దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం పడలేదు. తాము కేవలం ఖతార్ గ్యాస్పైనే ఆధారపడటం లేదని, యుద్ధ ప్రభావం లేని కొత్త మార్కెట్ల వైపు చూస్తున్నామని భారత ప్రభుత్వం పేర్కొంది. ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాలు గ్యాస్ను సరఫరా చేస్తామని ఆఫర్ ఇచ్చాయి.
ప్రస్తుతానికి వినియోగదారులకు ఊరట కలిగించే విషయం ఏంటంటే సమీప భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ (PTI) తెలిపింది.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం చమురుపై ఎలా ఉంది?
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు చమురు కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడం, అదే ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని కొంతకాలం తమపై వేసుకుని వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. ‘నోమురా’ అనే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నివేదిక ప్రకారం.. ముడి చమురు ధరల పెరుగుదల భారాన్ని ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే భరిస్తున్నాయి. దీనిని నేరుగా వినియోగదారులపై రుద్దడం లేదు.
Also Read: ServiceNow : దేశంలో కస్టమర్ సర్వీస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను విడుదల చేసిన ‘సర్వీస్నౌ’
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రపంచ మార్కెట్ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ దాదాపు 16.8 శాతం పెరగగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) సుమారు 14 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మరోవైపు మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, భారత్ తిరిగి రష్యా నుండి చమురు దిగుమతులను ప్రారంభించింది. నివేదికల ప్రకారం.. మధ్యప్రాచ్యం నుండి చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో భారత్ ఇప్పుడు రష్యన్ చమురు వైపు మొగ్గు చూపుతోంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇటీవల మధ్యప్రాచ్యం నుండి కొనుగోళ్లను పెంచినప్పటికీ ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన సమస్యల నుండి బయటపడటానికి ఇప్పుడు రష్యన్ క్రూడ్ ఆయిల్ను ఎంచుకుంది.
