Infosys : దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం ఫ్రెషర్ల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించిన ఇన్ఫీ.. గతేడాది వారిని విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా అందులోని కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్లు ఇచ్చేందుకు రెడీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన కారణంగా వారిని తొలగిస్తున్నట్లు తెలిసింది.
Read Also: Josh Hazlewood: ఆర్సీబీకి జోష్ హేజిల్వుడ్ రూపంలో సమస్యలు
అయితే, ట్రైనీల తొలగింపుపై ఇన్ఫీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. లేఆఫ్లకు గురైన ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియా నివేదించింది. తాము ఫెయిల్ అవ్వాలనే పరీక్షలను చాలా కఠినంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ భవిష్యత్తు కష్టంగా మారిందంటూ వాపోతున్నారు. ట్రైనీలను 50 మందితో కూడిన బ్యాచ్లుగా పిలిచి వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్ను వీడాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది.
కాగా, 2022-23 నియామక ప్రక్రియలో భాగంగా 2000 మంది ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఎంపిక చేసింది. సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ తదితర పోస్టులకు ఎంపిక చేస్తూ, వారికి అదే ఏడాది ఆఫర్ లెటర్లు ఇచ్చింది. వారంతా 2022 బ్యాచ్ ఉత్తీర్ణులు. అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసినా వీరిని విధుల్లోకి తీసుకోవడంలో మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో కంపెనీపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు సైతం నమోదైంది. ఈ క్రమంలో రెండేళ్లు ఆలస్యంగా 2024 ఏప్రిల్లో వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది.
Read Also: Drone: ఆ డ్రోన్లతో డీల్ను రద్దు చేసిన భారత్..