US Tariffs: భారత్కు త్వరలో శుభవార్త అందవచ్చు. భారత్పై విధించిన అమెరికా టారిఫ్ (US Tariffs) 50 శాతం నుంచి కేవలం 15 నుంచి 16 శాతానికి తగ్గవచ్చు. ఇందుకోసం భారత్- అమెరికా ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నాయి. ఈ మేరకు మింట్ నివేదిక ఒకటి వెల్లడించింది.
టారిఫ్ 50% నుంచి 15%కి తగ్గింపు
మింట్ నివేదిక ప్రకారం.. రెండు దేశాలు చాలా కాలంగా ఒక వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయడానికి దగ్గరగా ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్పై అమెరికా విధించిన టారిఫ్ గణనీయంగా తగ్గనుంది. దాదాపు 50 శాతం ఉన్న టారిఫ్ కేవలం 15 నుంచి 16 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
Also Read: Maganti Sunitha Nomination : మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయండి – ప్రద్యుమ్న
డీల్లో వ్యవసాయం, ఇంధనం కీలకం
ఈ ఒప్పందంలో వ్యవసాయం, ఇంధనం రెండింటినీ కేంద్రంగా ఉంచుతున్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ట్రంప్ వైఖరిని బట్టి ఈ ఒప్పందంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును తగ్గించే అంశం తప్పకుండా ఉండే అవకాశం ఉంది. ట్రంప్ అంచనా ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయవచ్చు లేదా తగ్గించవచ్చు.
అక్టోబర్ చివరి నాటికి డీల్పై ప్రకటన?
అమెరికా- భారత్ మధ్య ఈ ఒప్పందం చివరి దశలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అక్టోబర్ నెలాఖరులోగా ఈ ఒప్పందం ఖరారు కావచ్చని కూడా నివేదికలో ఉంది. ఈ నెలాఖరులో ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం జరగనుండగా, ఆ సందర్భంగా ట్రంప్ దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఇరు దేశాలు దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.
అక్టోబర్ 22న ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ప్రధాని మోదీ గణనీయంగా తగ్గిస్తారని ట్రంప్ ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించడం ద్వారా అమెరికా టారిఫ్ల నుంచి భారీ ఉపశమనం పొందవచ్చనే నివేదికల వాదన మరింత బలపడుతోంది.