ప్రైవేటు బ్యాంకు దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన ఉద్యోగులకు రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటించాలని, కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ ఆ మేరకు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
కస్టమర్లతో నేరుగా సంబంధం లేని వ్యాపార, కార్పొరేట్ బ్యాంకింగ్లకు సంబంధించిన ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్లు తెలిపింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అయితే దీనిని నెలరోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని, ఆ తర్వాత పనితీరును బట్టి కొనసాగించాలా లేదా అనే నిర్ణయం ఉంటుందని తెలిపింది.
హెచ్డీఎఫ్సీలోని ట్రెజరీ ఆపరేషన్స్, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ బ్యాంకింగ్, హెచ్ఆర్ డిపార్టుమెంట్, ఫైనాన్స్ అకౌంట్స్ వంటి అంతర్గత విభాగాల ఉద్యోగులకు మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్తిస్తుంది. కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్తించదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వినియోగదారులకు బ్యాంకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది.
