నెల మారుతుందంటే సామాన్య ప్రజల్లో కొత్త టెన్షన్. ముందుగా గ్యాస్ ధర (Gas Price) ఎంత పెరుగుతుందో అని..వంట సామాన్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో.. పెట్రోల్ ధరలు (Petrol Price) తగ్గుతాయా..పెరుగుతాయా..అని ఎదురుచూస్తుంటారు. ఈ నెల కూడా అలాగే చూడడం స్టార్ట్ చేసారు. డిసెంబర్ మొదటి తేదీ సామాన్యులకు ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఎల్పిజి సిలిండర్ల ధరలను (LPG Prices) భారీగా పెంచి సామాన్య ప్రజల పై అదనపు భారం మోపాయి.
19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ .16.50 పెంచుతున్నట్టు ఆదివారం వెల్లడించాయి. తాజా పెంపుతో ఇప్పుడు దిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .1,818.50కు చేరుకుంది. వంటింట్లో, నిత్యం వినియోగించే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను ఓఎంసీలు పెంచలేదు. ఇది సామాన్యుడికి కాస్త ఉపశమనం కలిగించే విషయమే అయినప్పటికీ, రెస్టారెంట్లు వంటి ప్రాంతాల్లో వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచడం.. కస్టమర్లను పరోక్షంగా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవాలి. సిలిండర్ ధరలు పెరిగితే రెస్టారెంట్లు మెన్యూలో ధరలు పెంచే ఛాన్స్ ఉంటుంది. 5కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ల ధర కూడా రూ .4 పెంచడం జరిగింది. పెంచిన అన్ని ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
ప్రతి నెలా వంట గ్యాస్కు అదనంగా ఖర్చు పెట్టడం మధ్యతరగతి కుటుంబాల కోసం మరింత ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తుంది. ఇతర అవసరాలైన విద్య, ఆరోగ్యం, మరియు రోజువారీ ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని కుటుంబాలు గ్యాస్ బదులు కలప లేదా కట్టెల వంటలను ఉపయోగించే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికి గ్యాస్ ధరలు పెరడడం అనేది సామాన్య ప్రజలకు ఓ భారమనే చెప్పాలి.
19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలు ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి.
కోల్కతా : రూ. 1927 (నవంబర్లో రూ.1911.50),
ముంబై : రూ. 1771 (నవంబర్లో రూ.1754.50),
పాట్నా : రూ. 2072.50
చెన్నై : రూ. 1980.50
విజయవాడ : రూ.1962 (రూ.61 పెరిగింది),
హైదరాబాద్ : రూ.2028 (రూ.61 పెరిగింది).