Digital Transactions: దేశంలో డిజిటల్ విప్లవం, యూపీఐ లావాదేవీల పెరుగుదల వల్ల నగదు లావాదేవీలు (Digital Transactions) తగ్గడమే కాకుండా పాతబడిన, పాడైపోయిన కరెన్సీ నోట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజా నివేదిక ప్రకారం.. గత ఒక సంవత్సరంలో అలాంటి నోట్ల సంఖ్యలో దాదాపు 41 శాతం క్షీణత నమోదైంది.
గతంలో ప్రజలు తరచుగా నోట్లపై అనవసరమైన విషయాలు రాసేవారు. వాటిని మడిచి ఉంచేవారు లేదా సరిగా ఉపయోగించేవారు కాదు. ఈ కారణాల వల్ల నోట్లు త్వరగా పాడైపోయేవి. కానీ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల వైపు పెరుగుతున్న ఆసక్తి, ప్రజలలో అవగాహన, రిజర్వ్ బ్యాంక్ కఠిన చర్యల వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గింది.
Also Read: Dussehra holidays: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. విద్యార్థులకు దసరా సెలవులు ఎప్పటి నుండో తెలుసా?!
నాలుగు నెలల్లో చలామణీ నుంచి తొలగించిన నోట్లు
రిజర్వ్ బ్యాంక్ ప్రతి సంవత్సరం పాడైపోయిన నోట్లను మార్కెట్ నుంచి తొలగిస్తుంది. 2024 ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో మొత్తం 8.43 బిలియన్ నోట్లను వెనక్కి తీసుకుంది. అయితే 2025లో ఇదే కాలంలో ఆ సంఖ్య 5.96 బిలియన్లకు తగ్గింది. వివిధ కరెన్సీ నోట్ల విలువలను పరిశీలిస్తే, 2024 ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో 500 రూపాయల నోట్లు 3.10 బిలియన్లు, 200 రూపాయల నోట్లు 85.63 కోట్లు, 100 రూపాయల నోట్లు 2.27 బిలియన్లు, 50 రూపాయల నోట్లు 70 కోట్లు చలామణీ నుంచి తొలగించారు.
అదే కాలంలో 2025లో 500 రూపాయల నోట్లు 1.81 బిలియన్లు, 200 రూపాయల నోట్లు 56.27 కోట్లు, 100 రూపాయల నోట్లు 1.07 బిలియన్లు, 50 రూపాయల నోట్లు 65 కోట్లు చలామణీ నుంచి వెనక్కి తీసుకున్నారు. ఈ గణాంకాలు డిజిటల్ లావాదేవీల వల్ల నగదు వాడకం తగ్గుతోందని స్పష్టంగా చూపిస్తున్నాయి. దీనివల్ల పాతబడిన నోట్ల సంఖ్య తగ్గడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో నగదుపై ఆధారపడటం కూడా నిరంతరం తగ్గుతోంది. భవిష్యత్తులో ఈ ధోరణి మరింత వేగవంతం కావచ్చు.