Dearness Allowance: హోలీ పండుగకు ముందు కరువు భత్యం (DA) పెంపుదలపై మరోసారి చర్చలు ఊపందుకున్నాయి. జనవరి-జూన్ 2026 కాలానికి గాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డిఏను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గత ఐదేళ్ల ట్రెండ్ను గమనిస్తే మార్చి ప్రారంభంలో వచ్చే హోలీకి ముందే ఇటువంటి ప్రకటనలు రావడం సాధారణంగా జరగలేదు.
అంతకుముందు జూలై-డిసెంబర్ కాలానికి సంబంధించి అక్టోబర్ 1, 2025న 3 శాతం పెంపును ప్రకటించారు. దీనివల్ల ప్రస్తుతం ఉద్యోగులకు 58 శాతం డిఏ అందుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం!
Also Read: మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు
కేంద్ర ఉద్యోగుల ఆశలు
వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు తదుపరి సవరణలో 2 శాతం డిఏ పెరగవచ్చని ఆశిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే డిఏ ప్రస్తుతమున్న 58 శాతం నుండి ప్రాథమిక వేతనంలో 60 శాతానికి చేరుకుంటుంది. ఈ పెంపు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తుంది.
డిఏ పెంపు నిర్ణయం అనేది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) డేటా, గత నెలల ద్రవ్యోల్బణ గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. హోలీ వంటి పెద్ద పండుగ కావడంతో అంచనాలు పెరిగినప్పటికీ ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం కోసం వేచి చూడవచ్చు. దీనివల్ల ఏదైనా కొత్త ప్రకటన హోలీ తర్వాతే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డిఏ ప్రకటన- హోలీ సమయం
కరువు భత్యం ప్రకటన గురించి హోలీ సమయంలోనే ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు డిఏను సవరిస్తుంది. ఒకటి మార్చి ప్రాంతంలో రెండోది అక్టోబర్ లేదా నవంబర్లో. ఇటీవలి కాలంలో రెండోసారి పెంపు దీపావళి సమయంలోనే కనిపిస్తోంది. అయితే మార్చిలో చేసే ప్రకటన ప్రతిసారీ హోలీకి ముందే జరగలేదు. ముఖ్యంగా హోలీ పండుగ మార్చి ప్రారంభంలో వచ్చినప్పుడు క్యాబినెట్ నిర్ణయం తరచుగా ఆ నెల చివరిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిర్ణయ ప్రక్రియలో అసాధారణ వేగం ఉంటే తప్ప, డిఏ పెంపు ప్రకటన హోలీ తర్వాతే వెలువడే అవకాశం ఎక్కువగా ఉంది.
