UPI Users: భారతదేశంలో ఈరోజుల్లో యూపీఐ పేమెంట్స్ మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. కిరాణా షాపుల నుండి ఆన్లైన్ షాపింగ్ వరకు ప్రతిచోటా యూపీఐ వాడుతున్నాం. ఇది ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల ద్వారా ప్రజలను చిన్న తప్పు చేసేలా ప్రేరేపించి, నిమిషాల్లో వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
ఒక తప్పుడు క్లిక్ మీ ఖాతాను ఖాళీ చేయగలదు
చాలా సందర్భాల్లో నేరగాళ్లు WhatsApp, SMS లేదా కాల్ ద్వారా ‘పేమెంట్ రిక్వెస్ట్’ లేదా లింక్లను పంపిస్తుంటారు. ఇవి తెలిసిన వారి పేరుతోనో లేదా బ్యాంక్ పేరుతోనో రావడం వల్ల ప్రజలు ఏమాత్రం ఆలోచించకుండా Approve లేదా Pay క్లిక్ చేస్తారు. గుర్తుంచుకోండి యూపీఐ ద్వారా డబ్బులు రిసీవ్ (పొందడానికి) చేసుకోవడానికి ఎప్పుడూ పిన్ (PIN) ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
నకిలీ కాల్స్, మెసేజ్ల పట్ల జాగ్రత్త
నేరగాళ్లు తమను తాము బ్యాంక్ ఉద్యోగులుగా, కస్టమర్ కేర్ ఏజెంట్లుగా లేదా డెలివరీ ఎగ్జిక్యూటివ్లుగా పరిచయం చేసుకుంటారు. కేవైసీ (KYC) అప్డేట్, రిఫండ్ లేదా ఏదైనా బహుమతి గెలుచుకున్నారనే ఆశ చూపి యూపీఐ పిన్ అడుగుతారు. పిన్ చెప్పిన వెంటనే మీ ఖాతా నుండి డబ్బులు మాయమవుతాయి. ఏ బ్యాంక్ లేదా యూపీఐ యాప్ సంస్థ ఫోన్లో పిన్ అడగదని గుర్తుంచుకోండి.
Also Read: టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ లాంచ్.. రూ. 5.59 లక్షల ప్రారంభ ధరతో అదిరిపోయే ఫీచర్లు!
స్క్రీన్ షేర్, రిమోట్ యాప్స్ వద్దు
కొందరు మోసగాళ్లు AnyDesk లేదా TeamViewer వంటి యాప్స్ ఇన్స్టాల్ చేయమని చెబుతారు. ఈ యాప్స్ ద్వారా వారు మీ ఫోన్ను వారి కంట్రోల్లోకి తీసుకుని మీ ప్రమేయం లేకుండానే లావాదేవీలు చేస్తారు. ఎవరైనా మీ ఫోన్ స్క్రీన్ షేర్ చేయమని అడిగితే వెంటనే నిరాకరించండి.
సురక్షితంగా ఉండటానికి సులభమైన పద్ధతులు
- గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే పేమెంట్ రిక్వెస్ట్లను అంగీకరించకండి.
- మీ యూపీఐ పిన్ను ఎవరికీ చెప్పకండి.
- డబ్బులు పంపే ముందు అవతలి వ్యక్తి పేరు, అమౌంట్ను సరిచూసుకోండి.
- మీ యూపీఐ యాప్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఫోన్కు స్క్రీన్ లాక్ తప్పనిసరిగా వాడండి.
ఒకవేళ మోసపోతే ఏం చేయాలి?
మీరు పొరపాటున యూపీఐ మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంక్, యూపీఐ యాప్ కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేయండి. సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. పోర్టల్లో ఆన్లైన్ ఫిర్యాదు నమోదు చేయండి. త్వరగా స్పందించడం వల్ల మీ డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
