జనవరి నుంచి ఏథర్ స్కూటర్లకు ధరల పెంపు

జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3,000 వరకు ధర పెరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ ధరల పెంపు ప్రతి మోడల్‌కు ఒకేలా కాకుండా వేర్వేరుగా ఉండనుంది.

Published By: HashtagU Telugu Desk
Ather scooter prices to increase from January

Ather scooter prices to increase from January

. వినియోగదారులపై ప్రభావం చూపనున్న తాజా నిర్ణయం

. ధరల పెంపుకు కారణాలు ఇవే

. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏథర్ మోడళ్లు

.‘ఎలక్ట్రానిక్ డిసెంబర్’ ఆఫర్లు

Ather price hike : ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3,000 వరకు ధర పెరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ ధరల పెంపు ప్రతి మోడల్‌కు ఒకేలా కాకుండా వేర్వేరుగా ఉండనుంది. ఏథర్ ఎనర్జీ ప్రకటన ప్రకారం, ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది. ముఖ్యంగా బ్యాటరీలకు అవసరమైన లోహాలు, ఇతర కీలక భాగాల ధరలు అంతర్జాతీయంగా పెరగడం వల్ల తయారీ ఖర్చులు ఎక్కువయ్యాయని తెలిపింది. అదేవిధంగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ భాగాల ధరలు కూడా పెరిగాయని పేర్కొంది.

Ather Scooter

ఇక, ఫారెక్స్ మార్కెట్లో మార్పులు కూడా కంపెనీపై ప్రభావం చూపినట్లు వెల్లడించింది. రూపాయి విలువ మారడం వల్ల దిగుమతుల ఖర్చు పెరిగి, చివరకు వాహనాల ధరలపై ప్రభావం పడిందని ఏథర్ వివరించింది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, ధరల పెంపు తప్పనిసరి అయిందని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ మార్కెట్లో 450 సిరీస్ పేరిట పెర్ఫార్మెన్స్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి యువతను ఆకర్షించే ఫీచర్లు, అధిక పనితీరుతో అందుబాటులో ఉన్నాయి. అలాగే, కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్లను కూడా అందిస్తోంది. ఈ స్కూటర్ల ధరలు ప్రస్తుతం రూ.1,14,546 నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు రూ.1,82,946 వరకు ఉన్నాయి. కొత్త ధరల పెంపు తర్వాత ఈ మొత్తాలు స్వల్పంగా పెరగనున్నాయి. అయితే ఏ మోడల్‌పై ఎంత పెరుగుదల ఉంటుందనే విషయాన్ని కంపెనీ ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు.

ధరల పెంపు నేపథ్యంలో వినియోగదారులకు కొంత ఊరటనిచ్చేలా ఏథర్ ప్రస్తుతం ‘ఎలక్ట్రానిక్ డిసెంబర్’ అనే ప్రత్యేక స్కీమ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా ఎంపిక చేసిన నగరాల్లో స్కూటర్ కొనుగోలు చేసే వారికి రూ.20,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. . ఇదిలా ఉండగా, ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇతర ద్విచక్ర, విద్యుత్ వాహన తయారీ సంస్థలు కూడా ధరల పెంపు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులు కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  Last Updated: 22 Dec 2025, 07:39 PM IST