ఇటీవల కాలంలో ఓలా స్కూటర్ల వినియోగం బాగా పెరిగిపోయింది. కొనుగోలుదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆ కంపెనీ కూడా ఆ కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు మంచి మంచి ఆఫర్ లను ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఇప్పటికే గత నెల అనగా జనవరిలో ఆల్రెడీ భారీగా ఆఫర్లను ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలలో ఓలా స్కూటర్లపై రూ.25వేల దాకా తగ్గింపు ఆఫర్లు ఇస్తోంది. దీనిపై కంపెనీ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఓలా ఎస్1 ప్రో, ఎస్ ఎయిర్, ఎస్1 ఎక్స్ ప్లస్ మోడళ్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.
ఆ లెక్కన చూస్తే S1 ప్రో మోడల్ ధర ప్రస్తుతం రూ.1,47,499గా ఉంది. డిస్కౌంట్ తర్వాత ఇది రూ.1.29 లక్షలకు లభిస్తుంది. అలాగే ఓలా ఎస్1 ఎయిర్ మోడల్ ధర ప్రస్తుతం 1.19 లక్షలుగా ఉంది. డిస్కౌంట్ తర్వాత ఈ స్కూటర్ రూ.1.04 లక్షలకు లభిస్తుంది. మీరు ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ కావాలంటే ప్రస్తుతం దాని ధర రూ.1.09 లక్షలు ఉంది. తగ్గింపు తర్వాత ఇది రూ.84,999కి లభిస్తుంది. ఈ డిస్కౌంట్లను కంపెనీ తాజాగా ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ కంపెనీ జనవరిలో కూడా కొన్ని ఆఫర్లు ప్రకటించింది.
జనవరిలో 20వేల రూపాయల డిస్కౌంట్ ఇచ్చింది. ఓలా కంపెనీ ఈమధ్య ఎస్ 1 ఎక్స్ శ్రేణిలో 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తెచ్చింది. దీని ధరను రూ.1.09 లక్షలుగా తెలిపింది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో 190 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని తెలిపింది. బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 80వేల కిలోమీటర్ల వరకూ ఎక్స్టెండెడ్ వారంటీని ఉచితంగా ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.