EVs Dangerous : ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) ఎంతగా వినియోగంలోకి వస్తే వాతావరణ కాలుష్యం అంతగా తగ్గుతుందని చాలా అధ్యయన నివేదికలు ఢంకా బజాయించి చెప్పాయి. సాక్షాత్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విషయాన్ని అంతటా చెబుతున్నాయి. ఈవీల తయారీ సంస్థలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు, రుణాలను కేంద్ర సర్కారు అందిస్తోంది. విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యమే ఉండదని వాహన పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా ‘ఎమిషన్ అనలిటిక్స్’ (Emission Analytics) సంస్థ విడుదల చేసిన ఒక నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. దాని ప్రకారం.. పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా విద్యుత్ వాహనాల(EVs Dangerous) వల్లే ఎక్కువగా వాతావరణం కలుషితం అవుతోంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ‘వాల్స్ట్రీట్ జర్నల్’ ఈ నివేదికను పబ్లిష్ చేసింది. దీనిలోని పూర్తి వివరాలు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
ఎలక్ట్రిక్ వాహనాలలోని బ్రేక్లు, టైర్ల ద్వారా పార్టికల్ పొల్యూషన్ పెరిగే రిస్క్ ఉందని ‘ఎమిషన్ అనలిటిక్స్’ సంస్థ హెచ్చరించింది. సాధారణ వాహనాలతో పోలిస్తే ఈవీల బరువు ఎక్కువగా ఉంటుందని.. ఈ బరువు కారణంగా బ్రేక్లు, టైర్ల నుంచి గాల్లోకి భారీ మొత్తంలో పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) విడుదల అవుతుందని తెలిపింది. సాధారణ వాహనాలతో పోలిస్తే ఈవీల నుంచి విడుదలయ్యే పర్టిక్యులేట్ మేటర్ 1,850 రెట్లు ఎక్కువగా ఉంటుందని ‘ఎమిషన్ అనలిటిక్స్’ వివరించింది. ఈవీల బరువు ఎక్కువగా ఉండడం వల్ల వాటి టైర్లు త్వరగా చెడిపోతాయి. ముడిచమురు (క్రూడ్ ఆయిల్) నుంచి తీసిన సింథటిక్ రబ్బర్తో ఎలక్ట్రిక్ వాహనాల టైర్లను తయారు చేస్తారు. అందుకే ఈ టైర్ల నుంచి గాల్లోకి హానికారక కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ బరువు గురించి కూడా ‘ఎమిషన్ అనలిటిక్స్’ సంస్థ నివేదికలో ప్రస్తావించారు. సాధారణ కార్లలో గ్యాసోలిన్ ఇంజిన్లు ఉంటాయి. వీటితో పోలిస్తే ఈవీల బ్యాటరీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా వెయిట్ కారణంగా ఈవీల బ్రేక్లు, టైర్లపై ఒత్తిడి ఉండాల్సిన దాని కంటే అదనంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈవీల నుంచి గాల్లోకి ఎక్కువ కాలుష్యం విడుదలవుతుంది. అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ తయారు చేసే Model Yతో పాటు ఫోర్డ్ కంపెనీకి చెందిన F-150 Lightning మోడళ్ల కార్లు ఈవిధమైన కాలుష్యాన్ని కలగజేస్తాయని నివేదిక హెచ్చరించింది. ఈ రెండు కార్లలో బ్యాటరీల బరువు 816 కేజీల కన్నా ఎక్కువగా ఉందని వెల్లడించింది. సాధారణమైన గ్యాసోలిన్ కార్లతో పోలిస్తే.. ఈవీల టైర్ల ద్వారా 400 రెట్ల ఎక్కువగా కాలుష్యం విడుదలవుతోందని తెలిపింది. ఈ అంశాలను దృష్టిలోఉంచుకొని ఈవీల బాడీ మేకింగ్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని ‘ఎమిషన్ అనలిటిక్స్’ సంస్థ పేర్కొంది.
మన ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. కార్ల దిగుమతి సుంకం విషయంలో టెస్లా కంపెనీకి, భారత ప్రభుత్వానికి మధ్య రాజీ కుదరడం లేదు. ఈ ట్యాక్స్ని తగ్గించాలని టెస్లా ప్రపోజ్ చేస్తోంది. దిగుమతి చేసుకునే ఈవీలపై ట్యాక్స్ తగ్గించే ఆలోచన లేదని భారత సర్కారు అంటోంది.