Site icon HashtagU Telugu

Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ. 32 వేలు.. ఆఫర్ ఎప్పటి వరకో తెలుసా?

Best Scooters

Best Scooters

రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో నెలలో లక్షల సంఖ్యలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో ఆయా కంపెనీలు కూడా కొత్త కొత్త మోడల్స్ తో తక్కువ ధరకి మంచి మంచి ఫీచర్లు కలిగిన స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.. ఆ సంగతి పక్కన పెడితే ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్ లు కొనుగోలు చేయాలి అనుకుంటే వెంటనే కొనుగోలు చేయండి. ఎందుకంటే స్కూటర్లు కొనుగోలు చేయాలి అనుకున్న వారు మే 31 లోపు ఒక మంచి అవకాశం ఉంది.

రేపటి నుంచి అనగా జూన్ ఒకటవ తేదీ నుంచి ధరలు పెరగనున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్‌ 2పథకం కింద అందించే సబ్సిడీని ప్రభుత్వం తగ్గించింది. 2023 జూన్ 1 ఆ తర్వాత కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఇది వర్తిస్తుంది. అంటే జూన్ 1 తర్వాత ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, బైక్‌ల ధరలు గణనీయంగా పెరుగనున్నాయి. కాగా గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం ప్రతి కొలో వాట్‌-అవర్‌ (kWh)కి రూ. 10,000 మాత్రమే ఉంటుంది. అది కూడా వాహనాల ఎక్స్-షోరూం ధరలో గరిష్టంగా 15 శాతం మాత్రమే ఉంటుంది. ఇది గతంలో 40 శాతం ఉండేది.

ఈ ప్రకటన వచ్చిన తర్వాత చాలా ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీలు జూన్ 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఏథర్ ఎనర్జీ అనే కంపెనీ తమ ద్విచక్ర వాహనాల ధరలు రూ.32,500 వరకు పెరుగుతాయని తెలిపింది. దీంతో నేడు కొనుగోలు చేసే వారికి 32 వేల రూపాయలు ఆదా అవుతుంది. ఇదిలా ఉంటే పరిశ్రమలు సబ్సిడీ లేకుండా జీవించడం నేర్చుకోవాలని ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా అన్నారు. 2019లో రూ.30,000 ఉన్న సబ్సిడీ 2021లో రూ.60,000కి పెరిగిందని, ఇప్పుడు రూ.22,000 తగ్గిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి ఫేమ్‌ పథకాన్ని 2019 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట్లో మూడేళ్ల కాలానికి దీన్ని ప్రకటించినా తర్వాత 2024 మార్చి 31 వరకు మరో రెండేళ్ల కాలానికి పొడిగించింది.