కేంద్ర బ‌డ్జెట్ 2026.. ఆటో మొబైల్ రంగానికి భారీగా కేటాయింపులు!

కేటాయింపుల పెంపు ద్వారా ప్రభుత్వం పీఎల్ఐ సాయంతో ఉత్పత్తి, పెట్టుబడి కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆశిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Budget 2026

Budget 2026

Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026-27ను ప్రవేశపెడుతూ ఆటో విడిభాగాలు, ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కేటాయింపులను దాదాపు రెట్టింపు చేశారు. అయితే పీఎల్ఐ పథకంలో ఎటువంటి కొత్త విధానపరమైన మార్పులను ఆర్థిక మంత్రి ప్రకటించలేదు. కేటాయింపుల పెంపు వల్ల ‘అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్’ రంగంలో పరిశ్రమలకు గొప్ప ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

ఆర్థిక సర్వే 2026 ప్రకారం.. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మందికి పైగా ఉపాధిని కల్పిస్తోంది. అంతేకాకుండా భారతదేశం మొత్తం జీఎస్టీ (GST) వసూళ్లలో ఈ రంగం వాటా సుమారు 15 శాతంగా ఉంది.

ఆటోమొబైల్ రంగానికి భారీ కేటాయింపులు

‘డెవలప్‌మెంట్ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ’ గణాంకాల ప్రకారం.. బడ్జెట్ 2026-27లో ఆటో విడిభాగాలు, ఆటోమొబైల్ పీఎల్ఐ పథకం కింద రూ.5,939.87 కోట్లు కేటాయించారు. ఆర్థిక సంవత్సరం 2025-26లో దీని బడ్జెట్ అంచనా రూ. 2,818.85 కోట్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు అది భారీగా పెరిగింది. బడ్జెట్ పత్రాల ప్రకారం.. 2025-26లో పీఎల్ఐ వినియోగం సవరించిన అంచనా కేవలం రూ. 2,104.57 కోట్లుగా ఉంది.

Also Read: టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

అదేవిధంగా 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం రూ. 325.35 కోట్లు మాత్రమే. మొత్తంగా చూస్తే ఈసారి బడ్జెట్‌లో పీఎల్ఐపై ప్రభుత్వం గట్టి ఫోకస్ పెట్టిందని, బడ్జెట్ అంచనాల్లో పెద్ద ఎత్తున వృద్ధి కనిపిస్తోందని అర్థమవుతోంది.

బ్యాటరీ స్టోరేజ్ కోసం పీఎల్ఐ

అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్ పీఎల్ఐ పథకం కోసం 2026–27 బడ్జెట్ అంచనా రూ. 86.01 కోట్లుగా నిర్ణయించారు. ఇది 2025–26 సవరించిన అంచనా (రూ. 13.31 కోట్లు), 2024-25 వాస్తవ వ్యయం (రూ. 12.28 కోట్లు) కంటే చాలా ఎక్కువ. ఏసీసీ పీఎల్ఐ పథకం మొత్తం ఆమోదిత వ్యయం రూ. 18,100 కోట్లు. దేశంలో 50 GWh దేశీయ బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని స్థాపించడమే దీని లక్ష్యం. ఇప్పటివరకు 40 GWh సామర్థ్యాన్ని ఎంపిక చేసిన కంపెనీలకు కేటాయించారు.

ప్రభుత్వ లక్ష్యం

కేటాయింపుల పెంపు ద్వారా ప్రభుత్వం పీఎల్ఐ సాయంతో ఉత్పత్తి, పెట్టుబడి కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆశిస్తోంది. దీనివల్ల కంపెనీలు తమ పనితీరు లక్ష్యాలను చేరుకున్నప్పుడు, వాటికి అందే ప్రోత్సాహక నిధుల విడుదల కూడా పెరుగుతుంది.

  Last Updated: 02 Feb 2026, 08:22 PM IST