ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ల ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే వీరి ధరల నుంచి ఉపశమనం కలిగిస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సీఎన్జీ బైక్ ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో కొత్త బైక్ను తాజాగా శుక్రవారం లాంచ్ చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ తొలి సీఎన్జీ బైక్ను శుక్రవారం విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకు మార్కెట్ లోకి సీఎన్జీ కార్లు, ఆటోలు మాత్రమే అందులోబాటులో ఉండగా తొలిసారి సీఎన్జీ బైక్ వచ్చింది. అయితే ఈ బైక్ను మొత్తం మూడు వేరియంట్స్ లలో తీసుకొచ్చారు.
ఇకపోతే ఈ సీఎన్జీ బైక్ ధర విషయానికొస్తే.. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ డ్రమ్ రూ. 95,000 కాగా డ్రమ్ ఎల్ఈడీ ధర రూ. 1.05 లక్షలు, డ్రమ్ ఎల్ఈడీ డిస్క్ ధర రూ. 110 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైజ్గా నిర్ణయించారు. బుకింగ్స్ ప్రారంభం కాగా ప్రస్తుతానికి మాత్రం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో డెలివరీలు ప్రారంభం అయ్యాయి. కాగా సీఎన్జీ బైక్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. అలాగే ఈ బైక్ సీటు కింద సీఎన్జీ ట్యాంకును అమర్చారు. ఈ బైక్ సీఎన్జీ తో పాటు పెట్రోల్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం ఒక చిన్న బటన్ సహాయంతో ఫ్యూయల్ ను స్విచ్ ద్వారా మార్చుకోవచ్చు.
హ్యాండిల్ వద్ద ఈ స్విచ్ ను అందించారు. దీంతో సులభంగా సీఎన్జీ నుంచి పెట్రోల్కు, పెట్రోల్ నుంచి సీఎన్జీకి మార్చుకోవచ్చు. కాగా ఈ సీఎన్జీ బైక్ ఇంజన్ గరిష్టంగా 9.5bhp పవర్, 9.7nm గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే ఈ బైక్ మైలేజ్ విషయానికొస్తే.. ఈ బైక్ సీఎన్జీతో కిలోకు 102 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం కిలో సీఎన్జీ ధర రూ. 92 ఉంది. దీంతో ఈ బైక్ తో సుమారు రూపాయికి ఒక లీటర్ ప్రయాణించవచ్చన్నమాట. ఇక పెట్రోల్ విషయానికొస్తే.. 64 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఫ్రీడమ్ 125లో DRLతో కూడిన రౌండ్ హెడ్ల్యాంప్ ను అందించారు. 11 రకాల సేఫ్టీ టెస్టింగ్లను నిర్వహించిన తర్వాత ఈ బైక్ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. అన్ని టెస్ట్ల్లోనూ సీఎన్జీ కిట్ చెక్కు చెదరకపోవడం విశేషం. ఈజిప్టు, టాంజానియా, పెరూ, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా ఈ బైక్ను ఎగుమతి చేయనున్నారు.