2024 తర్వాత ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి వినియోగదారులకు వరసగా షాక్ లు ఇస్తున్నాయి. అందులో బాగంగానే తాజాగా కస్టమర్లకు మరోమారు షాక్ ఇచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే గత ఏడాది చెప్పిన విధంగానే ఇప్పటికే ఒకసారి ధరను పెంచేసిన టాటా మోటార్స్ తాజాగా ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీగా ఉన్న టాటా పంచ్ ధరను పెంచింది. వేరియంట్లను బట్టి టాటా పంచ్పై గరిష్ఠంగా రూ. 17 వేల వరకు హైక్ తీసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. టాటా పంచ్లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి ప్యూర్, అడ్వెంచర్, అకంప్లీష్డ్, క్రియేటివ్.
ఎంట్రీ లేవల్ టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ ధర రూ. 13వేలు పెరిగింది. ఫలితంగా టాటా మోటార్స్కి చెందిన టాటా పంచ్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్షోరూం ధర రూ. 6.13లక్షలకు చేరింది. ఇతర వేరియంట్ల ధరలు గరిష్ఠంగా రూ. 10వేల వరకు పెరిగాయి. అలాగే టాటా పంచ్లో సీఎన్జీ మోడల్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా.. దాని ధర కూడా పెరిగింది. సీఎన్జీ మోడల్పై రూ. 17వేల వరకు ప్రైజ్ హైక్ తీసుకుంది టాటా మోటార్స్. అయితే ధరల పెంపుతో టాటా పంచ్ ఎక్స్షోరూం ప్రైజ్ వివరాలు తెలుసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్సైట్ని లేదా స్థానిక డీలర్షిప్ షోరూమ్ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ టాటా పంచ్లో మస్క్యులర్ క్యాంప్షెల్ బానెట్ ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది.
ఇది.. 84 హెచ్పీ పవర్ని, 113 ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తుంది. సీఎన్జీ మోడల్ 72 హెచ్పీ పవర్ని, 103 ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్బాక్స్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే టాటా పంచ్కు ఫేస్లిఫ్ట్ వర్షెన్ని కూడా తీసుకురాబోతోంది టాటా మోటార్స్ సంస్థ. 2025లో ఈ వెహికిల్ లాంచ్ అవుతుందని సమాచారం. తన పోర్ట్ఫోలియోలోని వెహికిల్స్ని 3 ఏళ్లకు ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటుంది టాటా మోటార్స్. ఇందులో భాగంగానే టాటా నెక్సాన్, నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీ ఎస్యూవీలకు 2023లో ఫేస్లిఫ్ట్ వర్షెన్స్ వచ్చాయి. ఇక 2021లో లాంచ్ అయిన టాటా పంచ్కు 2024లో అప్డేటెడ్ వర్షెన్ రావాల్సి ఉంది. అయితే ఈ మోడల్ 2025 రెండో భాగంలో మార్కెట్లోకి అడుగుపెడుతుందని టాక్ నడుస్తోంది.