టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గంలో ఉత్సాహభరితంగా సాగింది. నియోజకవర్గ ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. పాదయాత్ర ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా అర్జునుడు అందించిన సేవలను లోకేశ్ కొనియాడారు. అనంతరం క్యాంప్ సైట్ వద్ద లోకేశ్ (Nara Lokesh) అభిమానులకు సెల్ఫీలు ఇస్తున్న సమయంలో పార్టీ సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సర్ ప్రైజ్ చేశారు. సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ప్రజలతో కలిసి నేతలు ఇద్దరూ క్యూలో నిలబడ్డారు. తమకు కూడా సెల్ఫీ కావాలని సీనియర్ నాయకులు అడగడంతో లోకేశ్ చిరునవ్వులు చిందించారు. ప్రజా సమస్యల పోరాటం కోసం గట్టిగా పోరాడుతున్నారంటూ వారు లోకేశ్ ను అభినందించారు.
పులిచర్ల సెంటర్ లో స్టూల్ పై నిలబడి లోకేశ్ (Nara Lokesh) స్థానికుల నుద్దేశించి ప్రసంగించారు. “ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డిని 43 వేల మెజారిటీతో గెలిపించారు. మీ సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. పాడి, మామిడిరైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. పుంగనూరులో ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి పాపాలే. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు. పుంగనూరులో టీడీపీ జెండాను ఎగురువేయండి. నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఏ అధికారినైనా వదిలే ప్రసక్తిలేదు. వాళ్ల తాట తీస్తా” అంటూ హెచ్చరించారు.
పాదయాత్ర దారిలో దిశా వాహనాన్ని చూసిన లోకేశ్ ఆ వాహనం ఎదుట సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ సమయంలోనే చంద్రగిరిలో గంజాయి దొరికిందని, అందుకునే ఇకపై జగన్ మోహన్ రెడ్డిని గంజాయి మోహన్ రెడ్డి అని పిలుస్తానని ఎద్దేవా చేశారు.
“గంజాయి మోహన్ రెడ్డి ఇంటి సమీపంలోనే అంధురాలైన దళిత యువతిని గంజాయి మత్తులో ఒకడు దారుణంగా నరికేస్తే అప్పుడు దిశ పోలీసులూ, దిశ వాహనం రాలేదు. దిశ చట్టం లేకపోయినా రంగులు వేసి, పేర్లు పెట్టిన దిశ వాహనాలలో పోలీసులు ఇదిగో ఇలా నా దగ్గర మైకు లాక్కోవడానికి నా వెంట తిరుగుతున్నారు. పుంగనూరు నియోజకవర్గం కొత్తపేట దగ్గర నన్ను ఫాలో అవుతున్న దిశ వాహనం ఇది” అంటూ లోకేశ్ ఆ వాహనాన్ని చూపించారు.
పుంగనూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర దారిలో మద్యాన్ని తీసుకెళ్తున్న ఓ వ్యాన్ వద్ద నిలబడి లోకేశ్ సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏడా దొరకని సరుకు మన ఆంధ్రప్రదేశ్లోనే తయారవుద్ది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
“నేను రోజూ సెప్తా వుండానే ప్రాణాలు తీసే జగన్ బ్రాండ్లని… అవి ఇవే. పాదయాత్రలో వెళుతుంటే కంటికి కానొచ్చాయి. పాపాల పెద్దిరెడ్డి ఇలాకా పుంగనూరులోనే బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్, మలబార్ హౌస్, మెలిస్సా… ఇవన్నీ సారుగారి సరుకే. ప్రభుత్వ దుకాణాల పేరుతో నడిచే జె సిండికేట్ షాపులకి జె బ్రాండ్స్ తీసుకెళ్తుంటే సెల్ఫీ కొట్టిన” అంటూ సెటైర్లు వేశారు.
Also Read: Investment in AP: పెట్టుబడుల గుట్టు! విశాఖ సదస్సు రహస్యం!!