Site icon HashtagU Telugu

YSRCP: సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన వైసీపీ

Ysrcp Mp's Complaint To Nhrc

Ysrcp Mp's Complaint To Nhrc

వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ అక్రమమంటూ, వైఎస్సార్సీపీ ఎంపీల బృందం జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ)ని ఆశ్రయించింది. మంగళవారం, ఈ బృందం ఎన్‌హెచ్ఆర్‌సీ యాక్టింగ్ చైర్ పర్సన్ విజయభారతిని కలిసింది.

ఏపీలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై, ముఖ్యంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, పోలీసులు చేసిన చిత్రహింసలపై ఎంపీలు ఫిర్యాదు చేశారు. వారిని అన్యాయంగా నిర్బంధం చేశారని, అధికారికంగా విచారణ జరిపించాలని ఎంపీల బృందం ఎన్‌హెచ్ఆర్‌సీని కోరింది.

యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను పోలీసులు హింసిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఎన్‌హెచ్ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్) ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు. ముఖ్యంగా, సోషల్ మీడియా కార్యకర్తలపై సెక్షన్ 111 లాంటి కఠినమైన చట్టాలను అమలు చేయడం దారుణంగా పేర్కొనారు.

మానవహక్కులను కాపాడుతూ, ప్రజాస్వామ్య విలువలను సంరక్షించాల్సిన అవసరమని చెప్పారు. ప్రధానంగా, పెద్దిరెడ్డి సుధారాణి మరియు ఆమె భర్త వెంకటరెడ్డి పై జరిగిన అక్రమ నిర్బంధంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. వీరిని నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచడం, ఇది సరైన చట్టబద్ధత లేకుండా జరిగిందని వారు తెలిపారు.

మానవహక్కుల ఉల్లంఘనపై డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పు చెప్పారు. వైసీపీ ఎంపీలు, వెంటనే జాతీయ మానవహక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై ఎన్‌హెచ్ఆర్సీ చైర్‌పర్సన్‌ను కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం సభ్యులు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి, డాక్టర్ తనూజా రాణి, బాబురావు ఉన్నారు.

ఇదిలా ఉంటే, పులివెందులలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నట్లుగా సమాచారం అందింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, మరియు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి వంటి ప్రముఖులపై పులివెందుల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం, ఈ ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నారు.

ఈ ఘటనకు ముందు, సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి వంటి ఇతర ప్రముఖులపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వీరిపై కేసు నమోదవడానికి కారణం, సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి చేసిన ఫిర్యాదు. పోలీసులు ఈ కేసులపై విచారణ జరుపుతూ, నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Exit mobile version