ఏపీ అధికార వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సుయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం నేడు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానుంది. బీసీ, ఎస్సీ మైనారిటీవర్గాలకు చెందిన 17మంది మంత్రులు ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నాలుగు రోజుల్లో నాలుగు ప్రాంతాల్లో అంటే విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇవాళ శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల జంక్షన్ దగ్గర వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా ఈ యాత్ర విజయనగరం చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రలు ప్రసంగించనున్నారు.
అనంతరం వైజాగ్ చేరుకుంటారు. శుక్రవారం అక్కడినుంచి బయలుదేరి అనకాపల్లి జంక్షన్, యలమంచిలి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం తాడేపల్లిగూడెంలో బస చేస్తారు. 28న అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు బైపాస్, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ తూర్పు, చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్ర నంద్యాలలో బస చేసి 29న కర్నూలు, డోన్, గార్లదిన్నె మీదుగా అనంతపురం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగిస్తారు. అక్కడితో యాత్ర ముగుస్తుంది.