ప్రధాని మోడీ ఎదుట బలనిరూణకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. సుమారు 3 లక్షల మంది ప్రజల్ని తరలించడం ద్వారా ఏపీలో బలంగా ఉన్నామనే సంకేతం ఇవ్వడానికి తహతహలాడుతోంది. నిర్బంధంగా డ్వాక్రా మహిళలను బస్సులు ఎక్కించే బాధ్యతను అధికారులకు అప్పగించారని తెలుస్తోంది. సంక్షేమ పథకాలు అందుకుంటోన్న లబ్దిదారుల్ని బలవంతంగా మోడీ సభకు తరలించడానికి వైసీపీ నానా యాతన పడుతోంది. సామదానదండోపాయాలను ఉపయోగిస్తూ కనీవినీ ఎరగని రీతిలో సభకు జనాన్ని తరలించడానికి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది.
ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ కూటమితో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవడానికి సాహసించలేని జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీ సభను సక్సెస్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. దీని వెనుక భవిష్యత్ రాజకీయ వ్యూహం దాగి ఉందని తెలుస్తోంది. ఇటీవల జాతీయ, ప్రాంతీయ మీడియా హౌస్ లు, వివిధ రకాల సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం జగన్ గ్రాఫ్ పడిపోయింది. ఫలితంగా బీజేపీ ఏపీలో ప్రత్యామ్నాయంగా టీడీపీ, జనసేన పార్టీలను ఎంచుకుంటుందని వైసీపీలోని ఆందోళన. అందుకే, బలంగా ఉన్నామని నిరూపించే ప్రయత్నం విశాఖ మోడీ పర్యటన సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని టాక్.
Also Read: CM Jagan : ఐటీసీతో జగన్ `స్పైసీ ` అడుగు
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ ఉమ్మడి బహిరంగ సభకు ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి మూడు లక్షల మంది హాజరవుతారని ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. రూ. 15,233 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులను ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరూ ఒకే వేదిక నుంచి జాతికి అంకితం చేస్తారని మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. జూలై 4న భీమవరంలో జరిగిన. అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జగన్, మోడీ ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఇద్దరూ రెండోసారి వేదికను పంచుకోబోతున్నారు.
వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వై. వి. సుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లోని సభా వేదికను పరిశీలించారు. ఐటీ మంత్రితో పాటు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి సుబ్బారెడ్డి సమీక్షించారు. ఉదయం 10 గంటలకు నిర్ణీత కార్యక్రమం ప్రారంభానికి రెండు గంటల ముందే వేదిక వద్దకు చేరుకోవాలని అమర్నాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేదిక నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో 6,850 మంది పోలీసు బలగాలను మోహరించారు. శనివారం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి 3,208 బస్సుల్లో ప్రజలు వస్తున్నారు. సమావేశానికి కనీసం 1.5 – 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని అక్కడి ఒక పోలీసు అధికారి చెబుతున్నారు.
Also Read: Modi, Pawan Meet: జగన్ కోసం రోడ్ మ్యాప్..?
వీవీఐపీ కాన్వాయ్ నోవాటెల్ హోటల్ నుంచి సర్క్యూట్ హౌస్ మీదుగా బయలుదేరి కుడివైపున సెవెన్ హిల్స్ ఆస్పత్రికి ఆసిలమెట్ట, స్వర్ణ భారతి స్టేడియం మీదుగా మద్దిలపాలెం ఏయూ ఆర్చ్కు చేరుకుంటుంది. అయితే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వేదిక వద్దకు దిగనున్నారు. రోడ్లు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రద్దీగా ఉండే అవకాశం ఉంది. సాధారణ ప్రజలు తమ ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేయాలని సూచించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని , ట్రాఫిక్ పోలీసులు వారికి సహాయం చేస్తారని వైజాగ్ నగర పోలీసు కమిషనర్ సిహెచ్. శ్రీకాంత్ ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి 7:25 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. ఇండియన్ నేవీ కి చెందిన INS డేగా వద్ద బస చేస్తారు. శుక్రవారం సాయంత్రం 6:15 గంటలకు నగరంలోకి రానున్న జగన్ మోహన్ రెడ్డి ఐఎన్ఎస్ డేగా వద్ద ప్రధానికి స్వాగతం పలుకుతారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సాయంత్రం 4.20 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో బస చేయనున్నారు. మొత్తం మీద కార్మికుల దెబ్బకు ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీని మానుకున్నారు. నేరుగా వేదిక వద్దకు పీఎం, సీఎం ఇద్దరూ హెలికాప్టర్లో దిగనున్నారన్నమాట.
Also Read: Modi Tour: `మోడీ` మీట్ అండ్ గ్రీట్