ఒక ఫోటో వంద ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటారు ఛాయచిత్రకారులు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన ఫోటో జగన్ సర్కార్ మనుగడపై అనుమానాలకు కలిగిస్తోంది. ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి ఉన్న ఫోటోలను ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం బయలుదేరింది. ఏపీలోని నర్సాపురం వద్ద జరిగిన `సర్సంగ్ చాలక్ ` సమావేశానికి విజయసాయిరెడ్డి హాజరయ్యాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి ఫోటోలు దిగాడు. `మార్గనిర్దేశం చేసే మాటలు వినే అవకాశం కలిగిందంటూ..` కామెంట్ ను జోడిస్తూ ఆ ఫోటోలను ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. బీజేపీ పార్టీని ఆర్ఎస్ఎస్ ను ప్రత్యర్థులు విడదీసి చూడలేరు. కేంద్రంలోని బీజేపీని నడిపిస్తోన్న శక్తి కూడా ఆర్ఎస్ఎస్ అనేది చాలా సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీ ల నుంచి విన్నాం. అలాంటి శక్తివంతమైన సంస్థ అధిపతి మోహన్ భగవత్ తో విజయసాయిరెడ్డి జోడీ కట్టాడు. సరిగ్గా ఇక్కడే రాజకీయపరమైన అనుమానాలకు తావిస్తోంది. అందుకు బలం చేకూరేలా ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎపిసోడ్ ఉంది.
It was a honour meeting Sarsanghchalak of the Rashtriya Swayamsevak Sangh @DrMohanBhagwat Ji today 27th December, 2021 at Narsapuram. Had the wonderful opportunity of seeking his blessings and listening to his words of guidance.@RSSorg pic.twitter.com/9jWr4dhcvS
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 27, 2021
పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షానికి చెందిన 12 మంది ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బహిష్కరించాడు. ఆ సమయంలో రాజ్యసభ వైసీపీ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి కేంద్రానికి, ప్రతిపక్షాలకు మధ్య సాన్నిహిత్యం నెరిపే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో బహిష్కృత ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్లారు. బీజేపీతో సఖ్యతగా ఉండడానికి ఈ ప్రయత్నం చేయడం గమనార్హం. తొలి నుంచి బీజేపీతో సఖ్యతను వైసీపీ కొనసాగిస్తోంది. ప్రతి విషయాన్ని కేంద్రానికి చెప్పిన తరువాత మాత్రమే జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ విషయాన్ని తొలి రోజుల్లో ఆ పార్టీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి వెల్లడించిన విషయం విదితమే. ఆనాటి నుంచి ప్రతి అంశంలోనూ బీజేపీ నిర్ణయాలకు ఢిల్లీ కేంద్రంగా మద్ధతు పలుకుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నుంచి వ్యవసాయ చట్టాల వరకు బీజేపీకి అండగా పార్లమెంట్ వేదికగా వైసీపీ నిలుస్తోంది. ఇదంతా ఢిల్లీ కేంద్రంగా విజయసాయిరెడ్డి పీఎంవో కార్యాలయం వేదికగా నడుపుతోన్న వ్యవహారంగా ఆ పార్టీలోని ఎంపీలే చెప్పుకుంటారు. `ఏం విజయ్ హౌర్ యూ` అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా మోడీ ఆప్యాయంగా పలురించాడు. భుజం మీద చేయివేసి వెంట తీసుకెళ్లిన ఆ రోజు నుంచి వైసీపీ, బీజేపీ మధ్య ఏదో జరుగుతుందనే సంకేతాలు వచ్చాయి. ఎన్డీయేలో వైసీపీ భాగస్వామ్యం కాబోతుందని పలుమార్లు ఢిల్లీ వేదికగా చర్చ జరిగింది. ఆ విషయాన్ని ఇరుపార్టీల నేతలు అంగీకరించారు. కానీ, ఆ చర్చ కార్యరూపం దాల్చలేదు.
ఇటీవల ఏపీలోని తిరుపతి పార్లమెంట్, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల క్రమంలో బీజేపీ, వైసీపీ రాజకీయ అస్త్రాలను విసురుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడింది. సుమారు 70 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు టచ్ లో ఉన్నారంటూ బహిరంగంగా కమలనాథులు గేమ్ ఆడారు. దానికి బలం చేకూరేలా ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్ కనిపిస్తోంది. వైసీపీలో నెంబర్ 2గా తొలి రోజుల్లో విజయసాయిరెడ్డి ఫోకస్ అయ్యాడు. విశాఖపట్నం కేంద్రంగా బలమైన రాజకీయ చక్రం తిప్పాడు. అక్కడి ఎమ్మెల్యేలు కొందరు సాయిరెడ్డి వాలకంపై జగన్ కు నేరుగా ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో ఆయన ప్రైవేటు వ్యవహారాలను కూడా జగన్కు చేరవేశారని వినికిడి. అప్పటి నుంచి ఆయనకు తాడేపల్లి ప్యాలెస్ ఎంట్రీ కష్టం అయింది. సాయిరెడ్డి స్థానంలో విశాఖ రాజకీయ వ్యవహారాలను టీటీడీ చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డికి కొంత మేరకు అప్పగించారు. ఆనాటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా సాయిరెడ్డి రాజకీయ చక్రం తిప్పడం ప్రారంభించారని టాక్. ఆ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ పెద్దలు, విజయసాయిరెడ్డి మధ్య కొన్ని రాజకీయ ఒప్పందాలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. దానికి రాజముద్ర వేసేలా సాయిరెడ్డి, మోహన్ భగవత్ ఫోటో ల ట్వీట్ ఉంది.
ఏపీ చరిత్రలో 50శాతానికి పైగా ఓట్లను సంపాదించిన పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగలేదు. ఆ విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలుమార్లు చెప్పాడు. స్వర్గీయ ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ప్రభుత్వాలను కూడా ఉదాహరణగా కోడ్ చేశాడు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఏపీ రాజకీయ పరిణామాలు ఉన్నాయని విశ్లేషకుల భావన.ప్రస్తుతం జగన్ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాజధాని అమరావతి విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నాడు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రత్యేకహోదా ఇస్తేనే ఎన్డీయేలో భాగస్వామి అవుతాననే అభిప్రాయాన్ని వెలుబుచ్చాడట. ఇవన్నీ కేంద్రంలోని బీజేపీకి నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే తిరుపతి కేంద్రంగా అమిత్ షా ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఏపీ బీజేపీ జగన్ సర్కార్ పై తిరగబడుతోంది. ప్రజాగ్రహ సభ ద్వారా ఏపీ ప్రభుత్వంపై యుద్ధానికి బీజేపీ శ్రీకారం చుడుతోంది.అందుకే, ఢిల్లీ బీజేపీ పెద్దలు విజయవాడకు చేరుకున్నారు. ఒక వైపు జగన్ సర్కార్ పై బీజేపీ ప్రజాగ్రహ సభ ఇంకోవైపు విజయసాయిరెడ్డి, మోహన్ భగవత్ ఫోటో ట్వీట్ తో పాటు ఇటీవల ఢిల్లీ కేంద్రంగా జరిగిన పరిణామాలను గమనిస్తే మాజీ ఎంపీ ఉండవల్లి చెప్పిన జోస్యం సాకారం కాబోతుందా? అనే అనుమానం కలుగుతోంది.