పచ్చి అబద్దాలను చెప్పడానికి ఏ మాత్రం వైసీపీ వెనుకాడడంలేదు. అమరావతి రాజధానిగా ఉండాలని ఏనాడూ జగన్ మోహన్ రెడ్డి చెప్పలేదని ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రికార్డ్ అయ్యాయి. వాటిని కూడా కాదని వైసీపీ నాయకులు రివర్స్ లో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ పార్టీలో మేధావి వర్గానికి చెందిన ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నోటి నుంచి అమరావతి ని ఏనాడూ జగన్మోహన్ రెడ్డి రాజధానిగా ఉండాలని కోరుకోలేదని చెప్పడం గమనార్హం.
తిరుపతి కేంద్రంగా చేసుకుని ఈనెల 29న మూడు రాజధానులకు మద్ధతుగా రాయలసీమ గర్జన కు భూమన కరుణాకర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. రాయలసీమ వాసులు అమరావతిని సమర్థించలేదని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అమరావతిని జగన్ ఆనాడు సమర్థించలేదా? అని చంద్రబాబు అంటున్నారని గుర్తు చేయగా జగన్ అమరావతిని నూటికి నూరు శాతం సమర్థించలేదని చెప్పారు. అమరావతి శంకుస్థాపనకు జగన్ కు ఆహ్వానం వస్తే ఆయన వెళ్లలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ విషయాన్ని ప్రజలు ఎన్నడూ మర్చిపోరని చెప్పారు.
Also Read: TTD: నవంబర్ 1 నుంచి టైమ్స్లాట్ సర్వదర్శనం టోకెన్లు..!!
శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటానని శాసనసభలో జగన్ చెప్పారని వివరించారు. ప్రభుత్వ భూమిలో రాజధానిని కట్టడం మంచిదని సూచించారని అన్నారు. రియలెస్టేట్ వ్యాపారానికి, ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకమని శాసనసభ సాక్షిగా జగన్ చెప్పారని పేర్కొన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తాము ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని పలు సందర్భాల్లో పేర్కొన్నామని గుర్తు చేశారు. రాయలసీమకు ద్రోహం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని, రాజధాని వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని భూమన పలు విషయాలను విడమరచి చెప్పారు.