YS Viveka Murder : వైఎస్ వివేకా హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం.. వైసీపీ ఎంపీకి సీబీఐ స‌మాన్లు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కొన్ని రోజులు స్త‌బ్ధుగా ఉన్న

Published By: HashtagU Telugu Desk
Viveka Murder

Viveka Murder Imresizer

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కొన్ని రోజులు స్త‌బ్ధుగా ఉన్న సీబీఐ ఇప్పుడు దూకుడు పెంచింది. ఈ కేసులో మొద‌టి నుంచి అనుమానితులుగా ఉన్న క‌డ‌ప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ స‌మాన్లు జారీ చేసింది. ఈ రోజు (మంగళవారం) హైదరాబాద్‌లో సీబీఐ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అయితే పులివెందుల్లో త‌న కార్య‌క్ర‌మాల కార‌ణంగా ఈ రోజు (మంగ‌ళ‌వారం) హాజ‌రుకాలేన‌ని.. మ‌రో తేదీ సూచించాల‌ని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల‌ను కోరిన‌ట్లు స‌మాచారం. సీబీఐ విచారణకి పూర్తిగా సహకరిస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన రోజే సీబీఐ నోటీసులు అందజేసింది.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్‌ వివేకానంద రెడ్డి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మార్చి 15, 2019న కడపలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి హత్య చేశారు. కడపలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు కొన్ని గంటల ముందు ఆయన హత్యకు గురయ్యారు. మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్‌లు) సోదాలు నిర్వహించినా మిస్టరీని చేధించడంలో విఫలమయ్యారు. కొంతమంది బంధువులపై అనుమానం వ్యక్తం చేసిన వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2020లో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. 2021 అక్టోబరు 26న హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసి, జనవరి 31, 2022న అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. నవంబర్, 2022లో, హత్య వెనుక పెద్ద కుట్రపై విచారణ, దర్యాప్తును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమైన విచారణ, విచారణ జరగడంపై సునీతారెడ్డి లేవనెత్తిన సందేహాలు సహేతుకమైనవేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

  Last Updated: 24 Jan 2023, 07:41 AM IST