వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ అన్యోన్య దంపతులు. అందుకే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో ఆయన కనిపించాడు. ఆత్మీయ సభల్లోనూ దర్శనం ఇచ్చాడు. లోటస్ పాండ్ లోని కొన్ని సమావేశాల్లోనూ తెర వెనుక ఉన్నాడు. ఆ మధ్య కల్వరి టెంపుల్ కు చెందిన ఒక యువకుడు షర్మిల పక్కన తెలంగాణ ఉద్యమకారుడిగా దర్శనం ఇచ్చాడు. అతని మూలాలను వెతికితే, కొలవరి టెంపుల్ నిర్వహించే ప్రార్థనల సందర్భంగా కీ బోర్డు వాయించే వాయిద్యకారుడిగా తేలింది. ఇవన్నీ ఆ పార్టీలోని కార్యకర్తలకు తెలిసిన తెలుసు.`రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు..`అంటూ ఇటీవల మీడియాతో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలకు బలం చేకూరేలా సోమవారం మంత్రి బొత్సా నుంచి వచ్చిన స్పందన కనిపిస్తోంది. ఏపీలో షర్మిల పార్టీ పెడితే ప్రస్తుతం ఉన్న పది పార్టీల్లో అదీ కూడా ఒకటిగా ఉంటుందని ఆయన కామెంట్ చేశాడు. అంటే, షర్మిల ఏపీలో పార్టీని విస్తరింప చేస్తారనే రీతిలో బొత్సా వ్యాఖ్యలు ఉన్నాయని అర్థం అవుతోంది. ఇక ఆమె పార్టీ గురించి విజయవాడలో కనిపించిన బ్రదర్ అనిల్ ను మీడియా ప్రశ్నించింది. షర్మిల ఏపీ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని అనిల్ వ్యాఖ్యానించాడు. ఆమె రాజకీయ పార్టీ గురించి కామెంట్ చేయనని తప్పుకున్నాడు. విజయవాడలో చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చానని తప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఏపీలో షర్మిల పార్టీ పెడుతుందన్న ప్రచారాన్ని ఆయన ఖండించకపోవడం గమనార్హం.
తొలి రోజుల్లో షర్మిల చాలా దూకుడుగా తెలంగాణ రాజకీయాలను నడిపే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆనాడు వైఎస్ కు సన్నిహితంగా ఉండే వివిధ రంగాలకు చెందిన వాళ్లతో సమావేశం అయింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావానికి ముందుగా కంచె ఐలయ్య, గద్దర్ , మహ్మద్ షఫీ, ఆర్ క్రిష్ణయ్య..తదితరులతో ఆమె భేటీ అయ్యారు. ఆ తరువాత వాళ్లను కాదని కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత వైపు షర్మిల మొగ్గుచూపింది. ప్రతి మంగళవారం నిరుద్యోగదీక్షకు పూనుకుంది. రైతు ఆవేదన యాత్రను చేసింది. డిసెంబర్ 20వ తేదీన పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో ఆమెకు వచ్చిన స్పందన అంతగా లేదు. మీడియా కూడా ఆమె కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ప్రస్తుతానికి ఆమె స్లో అయింది.తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య సాన్నిహిత్యం ఉంది. వాళ్లిద్దరి మధ్యా రాజకీయపరమైన అనుబంధం చాలా గట్టిగా ఉందని వాళ్ల అనుచరులు భావిస్తుంటారు. అందుకే, షర్మిల పార్టీ ని క్లోజ్ చేయాలని జగన్ మీదుగా కేసీఆర్ ఒత్తిడి తెచ్చాడని టాక్. ఆ క్రమంలోనే షర్మిల్, జగన్ మధ్య ఆస్తుల వివాదం నెలకొందని ఇడుపులపాయ వర్గాల గుసగుసలు. వీటికితోడు బ్రదర్ అనిల్ నిర్వహిస్తోన్న కల్వరి టెంపుల్ వ్యవహారంపై రాజకీయ ఒత్తిడి నెలకొందని టెంపుల్ వర్గాల వినికిడి. అందుకే, షర్మిల పార్టీకి తనకు సంబంధంలేదని బ్రదర్ అనిల్ చెబుతున్నాడని లోటస్ పాండ్ లోని టాక్.
`రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు..అధికారంలో ఉన్నవాళ్లు అది పర్మినెంట్ అనుకోవచ్చు..`అంటూ రెండు రోజుల క్రితం మీడియాతో షర్మిల్ మాట్లాడారు. ఇవన్నీ ఏపీ లో పార్టీ పెడుతున్నారా? అనే ప్రశ్నకు వస్తున్న సమాధానాలు. మంత్రి బొత్సా, షర్మిల, బ్రదర్ అనిల్ వ్యాఖ్యల్లోని ఆంతర్యం కూడా ఏపీ ఎంట్రీ గురించి స్పష్టం చేస్తోంది. తెలంగాణ కంటే ఏపీలోనే తన సత్తా చాటాలని తాజాగా షర్మిల భావిస్తోందట. ఆ మేరకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందని ప్రచారం ఊపందుకుంది. అందుకే, బ్రదర్ అనిల్ కూడా అనుచరగణాన్ని సిద్ధం చేయడానికి విజయవాడ వెళ్లాడని టాక్. తెలంగాణ కోడలిగా ఇక్కడే తేల్చుకుంటానని చెబుతోన్న షర్మిల తొలి రోజుల్లో రాజన్న రాజ్యం ఏపీలో ఉందని చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చెప్పడంలేదు. అంటే, షర్మిల ఆలోచన ఏపీ వైపు ఎలా మళ్లిందో. .ప్రత్యేకంగా చెప్పనవసంలేదు!