Avinash Reddy Assets : వైఎస్సార్ సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. వాటి ప్రకారం.. గత ఐదేళ్లలో వైఎస్ అవినాశ్ రెడ్డి కుటుంబ ఆస్తులు 116 శాతం పెరిగాయి. 2019లో రూ.18.6 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తులు.. 2024 నాటికి రూ.40 కోట్లకు పెరిగాయి. ఈ ఆస్తుల్లో రూ.7.5 కోట్లు చరాస్తులు, రూ.32.8 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
తన భార్య సమత పేరుపై రూ.25.51 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని అవినాశ్(Avinash Reddy Assets) వెల్లడించారు. విశాఖపట్నం, వైఎస్సార్ జిల్లా వల్లూరు, ఊటుకూరు, పొనకమిట్టలో 33.90 ఎకరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పులివెందుల మండలం వెలమవారిపల్లె, భాకరాపురం, అంకాళమ్మగూడూరు ప్రాంతాల్లో మరో 27.40 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. తనకు రూ.32.75 లక్షల విలువైన ఇన్నోవా కారు ఉందని తెలిపారు. తన చేతిలో రూ.14,36,200 నగదు ఉందని, తన భార్య వద్ద రూ.8,06,500 నగదు ఉందని అవినాశ్ రెడ్డి వివరించారు. వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులు లేవని స్పష్టం చేశారు. ఎల్ఐసీ పాలసీ ఉందని ఆయన పేర్కొన్నారు.
రూ.9.13 కోట్ల అప్పులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో అవినాశ్ రెడ్డి తెలిపారు. తనకు ఏ వ్యక్తులు, సంస్థలు చెల్లించాల్సినవి ఏమీ లేవన్నారు. అవినాశ్ రెడ్డి వద్ద రూ.23 లక్షలు విలువైన 355 గ్రాముల బంగారం ఉంది. ఆయన భార్య వద్ద రూ.85 లక్షలు విలువైన 1.3 కేజీల గోల్డ్ ఉంది. అఫిడవిట్ ప్రకారం అవినాశ్ రెడ్డిపై 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వైఎస్ వివేకా మర్డర్ కేసు అభియోగాలను ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా అఫిడవిట్లో అవినాశ్ ప్రస్తావించారు. బ్రిటన్లోని వార్సెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసినట్లు ఆయన తెలిపారు.