ఏసీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఆయన కేసుల చుట్టూ తిరగడం మామూలే. ఎప్పుడు హస్తిన వైపు అడుగుపెట్టినా స్వప్రయోజనాలకు వెళుతున్నాడని ప్రచారం రావడం సహజంగా మారింది. తాజాగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ తీసుకున్నాడు. వాళ్లదర్నీ కలిసి పోలవరం, అమరావతి గురించి చర్చిస్తారని వైసీపీ వర్గాల టాక్. కానీ, బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు రిజర్వు చేసిన తీర్పు గురించి లాబీయింగ్ చేసుకోవడానికి వెళ్లాడని ప్రత్యర్థుల ఆరోపణ.సీబీఐ ప్రత్యేక కోర్టులోజగన్ మీద ఉన్న ఆస్తుల కేసు విచారణ ఇటీవల పూర్తయింది. ఆ కేసులకు సంబంధించిన తీర్పు ప్రస్తుతం రిజర్వులో ఉంది. ఒక వేళ బెయిల్ రద్దు చేస్తే..మళ్లీ ఆయన జైలుకు వెళ్లాలి. ఇప్పటికే16 నెలల పాటు జైలు జీవితం గడిపాడు. ముఖ్యమంత్రి అయిన తరువాత కోర్టు హాజరు నుంచి మినహాయింపు తీసుకున్నాడు. చివరి విచారణ రోజు కూడా జగన్ హాజరుకాలేదు. ఇప్పుడు తీర్పు రిజర్వులో ఉన్న క్రమంలో ఏ రోజైనా ఏదైనా జరగొచ్చని న్యాయవర్గాల సమాచారం. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్ అయింది.
వైసీపీ వర్గాలు చెబుతున్న ప్రకారం పోలవరం, అమరావతి గురించి ఇప్పుడు మోడీ, షా ను కలవాల్సిన అవశ్యకత పెద్దగా లేదు. ఎందుకంటే, ప్రతి అంశాన్ని కేంద్రానికి చెప్పిన తరువాత మాత్రమే జగన్ సర్కార్ చేస్తోంది. ఆ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లోనే చెప్పాడు. అంటే, మూడు రాజధానులు,పోలవరం సామర్థ్యం తగ్గింపు అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకుండా జరిగి ఉంటాయని భావించలేం. విభజన చట్టంలోని పలు అంశాలు ఇప్పటికే అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికీ వాటి గురించి పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో ఏపీ సర్కార్ ఉంది.పార్లమెంట్ వేదికగా అమరావతి, ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్ ..తదితర అంశాలపై కేంద్రం స్పష్టతను ఇచ్చింది. ఇంకో వైపు విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తామని మోడీ సర్కార్ తేల్చేసింది. ఈ పరిణామాల నడుమ జగన్ ఢిల్లీ భేటీని ఖరారు చేసుకున్నాడు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయన భేటీలు బెయిల్, జైలు గురించి చర్చించడానికి మాత్రమేనంటూ ఏపీలోని విపక్షాలు విశ్వసిస్తున్నాయి. అందుకు బలం చేకూరేలా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలు ఉన్నాయి. బెయిల్ మీద ఉన్న వాళ్లు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటూ ప్రజాగ్రహసభ ద్వారా ఆయన స్పష్టం చేశాడు. విజయవాడ కేంద్రంగా జవదేకర్ నోట జైలు మాట వచ్చిన రెండు రోజులకే జగన్ ఢిల్లీ ప్రయాణం కట్టడం గమనార్హం.
రాష్ట్ర ప్రయోజనాలు, స్వప్రయోజనాలకు తోడు తాజాగా రాజకీయ ప్రయోజనాలను కూడా ప్రత్యర్థులు తెరమీదకు తీసుకొస్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణమరాజు త్వరలోనే బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడట. ఆ చేరికను ఆపేసేందుకు జగన్ ఢిల్లీ భేటీలు అంటూ రాజకీయ కోణాన్ని ప్రత్యర్థులు బయటకు లాగారు. మొత్తం మీద జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా జైలు అంశం బయటకు రావడం సహజంగా మారింది. కానీ, ఈసారి జైలు విషయంలో కేంద్రం చేతులెత్తేస్తుందని ప్రత్యర్థులు భావిస్తున్నారు. సో..జైలా? బెయిలా? రెబల్ త్రిబుల్ ఆర్ పై గెలుపా? అనేది జగన్ ఢిల్లీ టూర్లో తేలనుందన్నమాట.