స్థానిక సంస్థల విధులు, నిధులు, అధికారాల కోసం ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ మళ్లీ ఉద్యమబాట పట్టింది. కొన్ని దశాబ్దాలు రాజ్యాంగంలోని 70వ అధికారణం కింద స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రయోజనాల గురించి ఛాంబర్ పోరాడుతోంది. పార్టీలకు అతీతంగా ఛాంబర్ ఉద్యమాలను నిర్వహిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పలువురు సీఎంల మెడలు వంచిన ఘనత ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ కు ఉంది. విధులు, నిధులు, అధికారాల కోసం రాజీలేని పోరాటం చేస్తోంది.తాజాగా ఏపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులను భారీగా పక్కదోవ పట్టించింది. కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం సిఫారస్సు మేరకు పంపిన రూ. 3వేల కోట్ల నిధులను జగన్ సర్కార్ మాయం చేసింది. ఆ నిధుల కోసం పంచాయతీ సర్పంచ్లు ఒక రోజు నిరాహారదీక్షలకు దిగారు. ముఖ్య అతిథిగా ఛాంబర్ అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ దీక్షల్లో పాల్గొని వాళ్లను ఉద్యమం దిశగా నడిచేలా దిశానిర్దేశం చేశాడు.
సర్గీయ నందమూరి తారకరామారావు, చంద్రబాబు నాయుడు, వై. యస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోని ప్రభుత్వాలపై పోరాడిన చరిత్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కు ఉంది. ఆనాడు నిధుల కోసం చేసిన పోరాటాలు పలు సందర్భాల్లో ఫలించాయి. కానీ, ఇప్పుడు జగన్ సర్కార్ ఛాంబర్ పోరాటాలకు స్పందించడంలేదు. దీంతో ఉద్యమాన్ని మరింత దూకుడుగా తీసుకెళ్లాలని రాజేంద్రప్రసాద్ పిలుపు నిచ్చారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 70 ప్రకారం దేశానికి ప్రధాని, రాష్ట్రానికి సీఎం ఎలాగో…పంచాయతీకి సర్పంచ్ కూడా అంతే. కానీ, నిధులను మళ్లించడం ద్వారా సర్పంచ్ లను ఏపీ ప్రభుత్వం ఉత్సవ విగ్రహాల మాదిరిగా మార్చేసింది. పైగా గ్రామ సచివాలయ వాలంటీర్ల ఎదుట పలుచన చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల అధికారాలను దాదాపుగా జగన్ సర్కార్ శూన్యం చేసింది. విధులు, నిధులు, అధికారాలు..ఏవీ లేకుండా నడిరోడ్డు మీద పంచాయతీ సర్పంచ్ లను నిలిపింది. మళ్లించిన రూ. 3వేల కోట్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదని ఛాంబర్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం దిగుతుందా? లేక లైట్ గా తీసుకుంటుందా? అనేది చూడాలి.