సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఓటీపీ అంటూ లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. చివరకు ఓ అధికార పార్టీ ఎంపీ సైతం సైబర్ క్రమ్ బారిన పడటం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఖాతా నుంచి ఏకంగా 97,699 మాయం చేశారు. ఏపీలోని కర్నూల్ లోక్సభ ఎంపీ సంజీవ్ కుమార్ ఇటీవల తన బ్యాంకింగ్ వివరాలు, వన్ టైమ్ పాస్వర్డ్లను (OTPలు) షేర్ చేయడంతో బ్యాంక్ ఖాతా నుంచి రూ. 97,699 మాయమైనట్టు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్పై వివరాలతో పాటు ఫిషింగ్ దాడికి పాల్పడిన తీరుపై ఎంపీ కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీ బ్యాంకు ఖాతా నుంచి నగదు డ్రా అయిన లావాదేవీల డిజిటల్ ట్రేస్పై పోలీసులు ఆరా తీస్తున్నారు. “మేం లావాదేవీలను పరిశీలిస్తున్నాం. త్వరలోనే కేసును పరిష్కరిస్తాం” అని విచారణకు ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. YSRCP MP ఫోన్ కు పాన్ కార్డు లింకప్ చేయాలంటూ టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. బ్యాంక్ కు వెళ్లకుండానే నెట్ బ్యాంకింగ్ చేసేలా లింక్ పంపారు. అయితే ఆయన ఆ మెసేజ్ నిజమైందని భావించి లింక్ పై క్లిక్ చేశారు. అక్కడితో ఆగకుండా సైబర్ నేరగాళ్లు అడిగిన వివరాలను అందులో పొందుపర్చాడు. ఆ తర్వాత ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఎంపీకి కాల్ చేసి ఓటీపీ తెలుసుకోవడంతో సైబర్ నేరస్తుడు డబ్బును కాజేశాడు. చివరకు మోసపోయానని తెలుసుకున్న ఎంపీ పోలీసులకు కంప్లైట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం ఏపీలో చర్చనీయాంశమవుతోంది.