ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభ సమయాన్ని వృధా చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ బాబుపై కేసు ఎత్తివేయాలని రచ్చ చేస్తున్నారని.. రెండు రోజులుగా సభలో టీడీపీ అసభ్యంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రమ్మంటే ఎందుకు టీడీపీ రావటం లేదో సమాధానం చెప్పాలని.. స్కామ్ లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారని మంత్రి బొత్స అన్నారు. స్కిల్ స్కామ్ లో ఎంత అవినీతి జరిగింది తాము సభలో చెప్పామని.. టీడీపీ ఏం చెప్తుందో సభలో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చర్చల్లో పాల్గొంటే దొరికిపోతాం అని టీడీపీ భయపడుతుందని.. తప్పు చేసారు కాబట్టే హై కోర్ట్ క్వాష్ పిటిషన్ కొట్టేసిందన్నారు.
ఇటు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాను దోపిడీ చేసిన గజ దొంగ చంద్రబాబూ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వేలాది కోట్ల రూపాయల కుంభకోణములో బాబు ఇరుక్కున్నాడని.. ఫెక్ ఒప్పందంతో నిధులు మళ్లించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. సభ లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా సమయాన్ని వృధా చేస్తున్నారని.. బాల కృష్ణ అసెంబ్లీలో స్క్రీన్ మీద నటిస్తున్న అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులూ అసెంబ్లీ ,కౌన్సిల్ లో దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ మండిపడ్డారు. రెండు రోజులుగా సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారని.. దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్పై చర్చలో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు