Site icon HashtagU Telugu

YCP MLC Elections : ఓటమిని ముందే గ్రహించిన వైసీపీ..అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం..!!

Ycp Mlc

Ycp Mlc

ఏపీలో వైసీపీ పార్టీకి (YCP) గడ్డు కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు సార్లు తామేదో అధికారం అని విర్రవీగిన జగన్ బ్యాచ్..కూటమి దెబ్బకు కుదేలయింది. 175 కి 175 కొట్టబోతున్నామని తొడలు కొట్టి , మీసాలు మెలేసి..సినిమా డైలాగ్స్ పేలిస్తే..ప్రజలు మాత్రం 11 సీట్లకు పరిమితం చేసి కోలుకోలేని దెబ్బ..ముఖం చూపించుకోలేని దెబ్బ కొట్టారు. ప్రజల దెబ్బకు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న జగన్ బ్యాచ్ కి కూటమి సర్కార్ ఇస్తున్న వరుస షాకులతో ఏంచేయాలో తెలియడం లేదు. అందుకే వరుస పెట్టి వైసీపీ కి రాజీనామా చేస్తూ తదుపరి రాజకీయ భవిష్యత్ పై ఆలోచన చేస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు(YCP Decides To Boycott Graduate MLC Elections) దూరంగా ఉంటున్నట్లు వైసీపీ ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికను ధ‌ర్మ‌బ‌ద్ధంగా నిర్వ‌హించే ఛాన్స్ లేక‌పోవ‌డంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు వైసీపీ సీనియ‌ర్ నేత‌లు పేర్ని నాని, అంబ‌టి రాంబాబు, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తెలిపారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో కృష్ణా, గుంటూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల పార్టీ నేత‌లు స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యాన్ని వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ను ప్ర‌భుత్వం ధ‌ర్మ‌బ‌ద్ధంగా నిర్వ‌హించే ప‌రిస్థితి లేదు. అప్ర‌జాస్వామికంగా పాల‌న సాగిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ త‌ప్పుడు పోక‌డ‌ల‌ను నిర‌సిస్తూ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్నాం. ప‌క్ష‌పాతం లేకుండా నిష్ప‌క్ష‌పాతంగా, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఓట‌రు ఓటు వేసుకునే ప‌రిస్థితి లేదు. కృష్ణా, గుంటూరు, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల పార్టీ ఇన్‌చార్జులు ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణ‌యాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంగీక‌రించార‌ని, ఈ దుర్మార్గ వాతావ‌ర‌ణంలో ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నిక‌లు జ‌రుగ‌వు కాబ‌ట్టి ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పేర్ని నాని వెల్ల‌డించారు.

ఈ ప్రకటన పై టీడీపీ రియాక్ట్ అయ్యింది. EVMల పై నమ్మకం లేదని చెప్పిన జగన్ రెడ్డి, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నా సాకులు చెప్పి పారిపోతున్నాడు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి, తమకు ఎలాగూ ఓట్లు రావని, జగన్ రెడ్డి డిసైడ్ అయిపోయి, పోటీ చేయకుండానే పారిపోయాడు అంటూ ట్వీట్ చేసింది. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసి కనీస ఓట్లు తెచ్చుకోకపోతే పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందన్న భయంతో పోటీకి దూరంగా ఉంటున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఎన్నికలేనా..రాబోయే ఎన్ని ఎన్నికలకు కూడా ఇలాగే భయపడి దూరంగా ఉంటారా..? అనేది చూడాలి.

Read Also : Rishi Sunak : బెంగళూరులో బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి.. భార్యతో కలిసి కాఫీ షాపుకు