విజయవాడ పోలీసులకు ఒక ఇంట్రెస్టింగ్ ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇంతకీ ఏంటీ అనే కదా. భార్యభర్తలు అన్నాక ఎన్నో ఉంటాయి. అలకలు, చికాకులు..అంతలోనే సర్దుకుపోవడం. ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా నాలుగు గోడల మధ్యే ఉంటే సరే. కానీ ఇల్లు దాటి బయటకు వస్తే…పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇలాంటి ఘటనే విజయవాడలో జరిగింది. పోలీసులకు భర్త మీద భార్య ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం తీసుకురమ్మని ఒత్తిడి చేస్తున్నాడో…తప్పతాగి వచ్చి కొడుతున్నాడో…అనుమానంతో మానసిక, శారీరక హింసకు గురిచేస్తున్నాడో లాంటి ఫిర్యాదులు వస్తాయి.
కానీ ఈ ఫిర్యాదు మాత్రం భిన్నంగా ఉంది. తన భర్త బుగ్గ కొరికాడంటూ భార్య భర్త మీద ఫిర్యాదు చేయడం, విజయవాడ పోలీసులు కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. బుగ్గ కొరికితే కేసు పెట్టడమా అని అనుకుంటే తప్పు. దాని వెనక పెద్ద విషయమే ఉన్నట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు చూస్తే…క్రిష్ణా జిల్లాలోని కానూరుకు చెందిన తాళ్లపూడి రాంబాబు.. స్రవంతిలు భార్యభర్తలు. భర్త సెక్యురిటీ గార్డుగా పని చేస్తుంటాడు. భార్య ఇంటి వద్ద ఉంటుంది.
రాంబాబుకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో బాగా తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో భార్యతో గొడవ పెట్టుకున్నాడు రాంబాబు. అప్పటికే భర్తపై విసిగిపోయిన ఆమె గొడవలు వద్దంటూ మందలించింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన రాంబాబు.. ఆమెను కొట్టి.. అక్కడితో ఆగకుండా ఆమె బుగ్గ మీద కొరికాడు. ఈ నేపథ్యంలో భర్త నుంచి తప్పించుకున్న ఆమె ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స చేయించుకుంది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. భర్త మీద కేసు నమోదు చేసారు పోలీసులు. భార్య బుగ్గను కొరికినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.