Jagan: కడపలో జగన్‌కి ఎందుకంత నెగిటివిటీ?

వైసీపీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ఎన్నికలు కాస్ట్లీగా జరిగాయి. ఉమ్మడి కడప జిల్లాలోని 700 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేశారు.

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 07:37 PM IST

Jagan:వైసీపీ అధ్యక్షుడి (Jagan) సొంత జిల్లాలో ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా జరిగాయంట. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో దాదాపు 700 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేశారు. ఈసారి కడప(Kadapa) పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలల్లోనే అభ్యర్ధులు దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని జరిగిన ప్రచారంతో వైసీపీ కేండెట్లు ఎక్కడా తగ్గకుండా డబ్బు వెదజల్లారంట. సొంత జిల్లాలో ఒక్క స్థానం కూడా విపక్షాలకు దక్కకూడదని జగన్ (Jagan) ఇచ్చిన ఆదేశాలతో అభ్యర్ధులు అప్పులు చేసి మరీ ఖర్చుపెట్టారంట. ఈ సారి ఎన్నికలు అన్ని పార్టీలకు డూ ఆర్ డై అన్నట్లు మారాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి గెలవాల్సిందేనని టీడీపీ కృతనిశ్చయంతో ఉండగా రెండోసారి అధికారం చేపట్టాలని వైసీపీ (Ycp) పావులు కదిపింది. ఆ క్రమంలో కడప జిల్లాలో ఎన్నికలు వైసీపీ, ఎన్డీఏ కూటమితో పాటు కాంగ్రెస్‌కు కూడా సవాలుగా మారాయి. ఒకింత ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన పీసీసీ చీఫ్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ జిల్లాలో బలమైన అభ్యర్ధులనే పోటీకి దింపింది. దాంతో అక్కడ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. అన్ని పార్టీల అభ్యర్ధులు డబ్బులను మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేశారంట. ఈ సారి కడప లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల ఖర్చు ఎంత లేదన్నా 600 కోట్ల రూపాయలు ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే టీడీపీ .. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ… అంటూ జనంలోకి వెళ్లింది. దానికి ముందు నుంచే వైసీపీ నేతలు గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఇళ్ల చుట్టూ తిరిగారు. అలా అప్పటి నుంచే పార్టీ నాయకుల జేబులకు చిల్లులు పడటం మొదలైంది. అయితే టీడీపీ నేతలు సొంత ఖర్చుతో తిరగడం మొదలుపెడితే .. వైసీపీ నాయకులు ఆ కర్చుని గవర్నమెంట్ అకౌంట్‌లో వేసిన నడిపించేశారు. గడపగడప ప్రోగ్రాంని ప్రభుత్వ కార్యక్రమంలా నిర్వహించారు.

ఇక ఎన్నికల షెడ్యూలు దగ్గర పడేకొద్దీ పార్టీల ప్రచారాలు ముమ్మరమయ్యాయి. షెడ్యూల్ వెలువడ్డాక పీక్ స్టేజ్‌కి చేరాయి. పోల్ మేనేజ్‌మెంట్‌లో ఎవరూ ఎక్కడా తగ్గలేదంట. అధికార పార్టీ బద్వేల్, ప్రొద్దుటూరు, పులివెందులలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిందంటున్నారు. ఓటుకు సరాసరి వెయ్యి నుంచి 3 వేల వరకు ఇవ్వడంతో ఎన్నికల ఖర్చు అమాంతంగా పెరిగిందిట. అన్ని పార్టీల నేతలు షెడ్యూలు రాక ముందునుంచే ప్రచారం నిర్వహించారు. ఇక షెడ్యూలు వచ్చిన తరువాత రోజువారి ప్రచారాలు, వచ్చిన వారికి డబ్బులు, మద్యం, ఫ్లెక్సీలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ప్రకటనలు, సోషల్ మీడియాలో కాన్వాసింగ్, కరపత్రాలు, ప్రచార వాహనాలు ఇలా అన్నీ కలుపుకుంటే ఖర్చు భారీ స్థాయికి చేరింది. టీడీపీ, వైసీపీ ఏమాత్రం తీసిపోకుండా పోటీ పడి ఓట్లను కొనుగోలు చేశాయంటున్నారు. 80 శాతం మంది ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు జిల్లాలో టాక్ నడుస్తుంది. కడపలో ఓటుకు వెయ్యి చొప్పున రెండు పార్టీలు పంపిణీ చేశారంట. అంటే ఒక్కో పార్టీ ఓట్ల కోసమే 20 కోట్లు ఖర్చు పెట్టింనట్లు చెప్తున్నారు. మిగతా పార్టీలు శక్తిమేర చెల్లించాయంట.

కడపలో చంద్రబాబునాయుడు (Chandrababu), సీఎం జగన్‌(Jagan)ల భారీ బహిరంగసభలు జరిగాయి. ఆ మీటింగులకు కూడా కోట్లలోనే ఖర్చైనట్టు లెక్కలు వినిపిస్తున్నాయి. మైదుకూరులో హోరాహోరీ ఎన్నికలు జరిగాయి. పాతకావులే మళ్లీ పోటీ పడ్డారు. ఈ సారి ఎలాగైనా గెలవాలన్న కషితో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సర్వశక్తులు ఒడ్డారు. వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్దఎత్తున చేరికలు జరిగాయి. మైదుకూరులో పోలింగ్ రోజు కూడా రెండుపార్టీలు దేనికి తీసిపోలేదు .. ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ 2వేలు పంచిందంట …అంటే ఒక్కో పార్టీ ఓట్లకోసమే సుమారు రూ.40 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేస్తున్నారు… ఇతర ఖర్చులు ఎంత తక్కువ అనుకున్నా 10 కోట్లు ఉంటాయి … అంటే రెండు పార్టీలు కలుపుకుంటే 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టాయని ఆ నియోజకవర్గంలో ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

మొత్తానికి ప్రొద్దుటూరులో రెండు పార్టీ ఎన్నికల ఖర్చు 100 కోట్ల మార్క్ దాటిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జమ్మలమడుగు లో సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చేయగా… వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరూ ఏ మాత్రం తీసిపోకుండా ఒక్కో ఓటుకు 2వేలు పంచారంట … చీరలు, ఇతరత్రా వస్తువులు కూడా తాయిలాలుగా ఇవ్వడంతో అక్కడ 80కోట్లు పైమాటే ఖర్చు అయిందని చెబుతారు. ఇది సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా భారీగానే పంపిణీలు జరిగాయంట. జగన్‌పై టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి బరిలో దిగారు. మరోవైపు వివేకాను చంపిన హంతకులకు ఓటు వేయవద్దని వివేకా కూతురు సునీత, జగన్ సోదరి షర్మిల పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

వివేకా హత్య వ్యవహారం ఎక్కడ డ్యామేజ్ చేస్తుందో అన్న భయంతో వైసీపీ శ్రేణులు .. కొన్ని ప్రాంతాల్లో 2,500 నుంచి 3వేల వరకు పంపిణీ చేశారని అంటున్నారు. ఇక టీడీపీ కూడా వెయ్యి పంచిందంట. ఓట్ల కొనుగోలే కాకుండా సీఎం జగన్ ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కడపలో జరిగిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు జనసమీకరణకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశాయి సభకు వచ్చిన వారికి డబ్బు, మద్యం, బిర్యానీలు సరఫరా చేయడంతో భారీగా ఖర్చు అయిందంటున్నారు. టీడీపీ కడప, ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలకు చంద్రబాబునాయుడు వచ్చారు. వాటికి కూడా గట్టిగానే ఖర్చైందంట. అసంతృప్తి నేతలను కూడా వైసీపీ అభ్యర్ధులు క్యాష్ కొట్టి లైన్‌లోకి తెచ్చుకున్నారంట.. పులివెందులలో అయితే నాయకుడు స్థాయిని బట్టి లక్ష మొదలుకుని 20 లక్షల వరకు ఇచ్చినట్లు చెబుతారు. ఇదే ఫార్ములాను – జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో అమలు చేశారంట. ఇక ఇతర పార్టీల్లోని వారిని కూడా డబ్బులు ఇచ్చి వైసీపీలోకి తీసుకువచ్చారన్న ప్రచారం జరుగుతుంది. మొత్తమ్మీద బూత్, ఇతరత్రా ఖర్చులు కలిపితే ఏడు సెగ్మెంట్లలో 600 కోట్లు ఈజీగా ఖర్చయ్యాయంటున్నారు విశ్లేషకులు.