Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జన సేనాని పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తారనే టాక్ వచ్చింది. అయితే ఆ ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఇంతకీ ఇప్పుడు పవన్ ఎక్కడున్నారు ?
Also Read :Sweden Shooting: ఒక తీర్పు.. ఒక మర్డర్.. స్వీడన్లో కాల్పులు.. 10 మంది మృతి
ఈ రోజు నుంచే కేరళ, తమిళనాడు పర్యటన
ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కీలకమైన రాజకీయ, సైద్ధాంతిక భాగస్వామిగా జనసేన ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్లో హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) కృషి చేస్తున్నారు. దీని గురించి గతంలో తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభలోనే ఆయన ప్రకటన చేశారు. దక్షిణాదిలోని ప్రముఖ హైందవ ఆలయాలను సందర్శించాలనే నిర్ణయానికి అప్పుడే పవన్ వచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు (బుధవారం) నుంచి కేరళ, తమిళనాడుల్లో పవన్ ఐదు రోజుల పాటు పర్యటిస్తారని సమాచారం. ఈరోజు హైదరాబాద్ నుంచి కేరళ పర్యటనకు పవన్ బయలుదేరుతారు. తొలుత కేరళలోని త్రివేండ్రంకు చేరుకొని, అక్కడి ఆలయాలను సందర్శిస్తారు. త్రివేండ్రంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని పవన్ దర్శించుకుంటారు. కొచ్చి పోర్టును పరిశీలిస్తారు. కేరళ రాష్ట్రంలోని గురువాయూర్, త్రిసూర్లలో ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. కేరళ పర్యటన ముగియగానే మూడు రోజులు తమిళనాడులో పర్యటిస్తారు. ఆ రాష్ట్రంలోని అరక్కోణం, మధురై ప్రాంతాల్లో ఉన్న చారిత్రక ఆలయాలను సందర్శిస్తారు. పవన్తోపాటు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ ఈ టూర్లో పాల్గొంటారు. గతంలో కేరళ టూరిజం డైరెక్టర్గా కృష్ణ తేజ వ్యవహరించారు. అందుకే ఆయనను పవన్ తనతో తీసుకెళ్లనున్నారు.
Also Read :Liquor Scam : భారీ లిక్కర్ స్కాం.. మద్యం ముడుపులకు హవాలా నెట్వర్క్.. సంచలన కథనం
ముగిసిన సింగపూర్ పర్యటన
ఇక కొన్ని రోజుల క్రితమే పవన్ కల్యాణ్ సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఆ టూర్ ముగిసింది. అది వ్యక్తిగత పర్యటన కావటంతో వివరాలను బయటికి వెల్లడించలేదు. సింగపూర్లో పవన్ సతీమణి అన్నా లెజినోవా చదువుతున్నారు. దీంతో అక్కడే కుటుంబంతో కొద్ది రోజులు గడిపి, హైదరాబాద్కు తిరిగి చేరుకున్నారు.