Political Heirs : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈసారి చాలామంది రాజకీయ వారసుల భవిష్యత్తు తేలిపోనుంది. వారికి గెలిపించాలా ? ఓడించాలా ? అనే దానిపై ఓటర్లే నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీ దాకా.. కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల దాకా అన్ని రాజకీయ పక్షాలు కూడా వారసులకు అవకాశాలు ఇచ్చాయి. ఎందుకంటే ఎన్నికల వేళ కావాల్సింది అంగబలం, అర్థబలం !! ఔనన్నా.. కాదన్నా.. ఇదే నిజం !! ఏదిఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ వారసులపై(Political Heirs) ఓ లుక్ వేద్దాం..
We’re now on WhatsApp. Click to Join
రాజకీయ పార్టీలు పలువురు నేతల వారసులకు టికెట్లు ఇచ్చేటప్పుడు వివిధ రకాల అంశాలను తెరపైకి తెచ్చారు. యువతకు అవకాశం ఇవ్వాలి. ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లో ఉండాలి. మహిళలకు ఛాన్స్ దక్కాలి అనే అంశాలను చెప్పారు. ఇవన్నీ నిజమే. కానీ సామాన్యులకూ వీటిని అప్లై చేస్తే ఇంకా బాగుంటుందని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా వారసుల భవితవ్యం మాత్రం రిజల్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. రాజకీయ వారసులకు టికెట్లు ఇవ్వడం ద్వారా పార్టీలు చేస్తున్న ప్రయోగం వికటిస్తుందా ? కలిసొస్తుందా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
- తిరుపతి నుంచి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అభినయ్ తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా కూడా ఉన్నారు. స్థానికంగా తన తండ్రికి ఉన్న క్రెడిబులిటీ తప్పక తనను గెలిపిస్తుందనే ధీమాలో ఆయన ఉన్నారు. డిప్యూటీ మేయర్గా తనకు స్థానిక కార్పొరేటర్లతో ఉన్న సాన్నిహిత్యం ఓట్లుగా కన్వర్ట్ అవుతుందని ఆశిస్తున్నారు.
- చంద్రగిరి నుంచి స్థానిక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2023 ఆగస్టులో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఆ హోదాలో ఉంటూనే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
- బందరు నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు క్రిష్ణమూర్తికి కూడా టికెట్ దక్కింది. స్థానికంగా ప్రజలకు చేరువగా ఉండే తత్వమే తనకు ఓట్లు కురిపిస్తుందని క్రిష్ణమూర్తి అంటున్నారు. నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు వంటి సమస్యలు ఎదురైనప్పుడు తాను దగ్గరుండి వాటికి పరిష్కారం దొరికేలా చేశానని చెబుతున్నారు. కరోనా టైంలోనూ చాలా ప్రజాసేవ చేశానని క్రిష్ణమూర్తి ప్రజలకు వివరిస్తున్నారు.
- రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే పిల్లి సుభాష్ కుమారుడు సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు.
- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాకు వైఎస్సార్ సీపీ టికెట్ ఇచ్చింది.గతంలోకి వెళితే.. 2023 సెప్టెంబరులో గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా హాజరవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏ హోదాతో ఆమె సమీక్ష సమావేశానికి హాజరయ్యారని అప్పట్లో ప్రశ్నలు ఉదయించాయి.
- పైన మనం చెప్పుకున్న వాటిలో గుంటూరు, బందరు మినహాయిస్తే చంద్రగిరి, తిరుపతి, రామచంద్రాపురంలలో పరిస్థితులు వైఎస్సార్ సీపీకి ఆశాజనకంగా లేవని తెలుస్తోంది.
టీడీపీ నుంచి వీరికి..
- తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి అవకాశం ఇచ్చింది.
- ప్రత్తిపాడు నుంచి ఇటీవల మరణించిన వరపుల రాజా సతీమణి సత్యప్రభకు టికెట్ కేటాయించింది.
- వెంకటగిరి నుంచి మహిళాకోటాలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు అవకాశం ఇచ్చింది.
- శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది.
- కమలాపురం నుంచి పుత్తా నరసింహారెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి పోటీ చేస్తున్నారు.
- పుట్టపర్తి నుండి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డి బరిలోకి దిగారు.
- కదిరి నుంచి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సతీమణి యశోదాదేవికి టికెట్ ఇచ్చారు.