Sv University : తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అకడమిక్ కన్సల్టెంట్ల తాత్కాలిక నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువతను దోచుకుంటున్నారని, విద్యావ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఘాటుగా స్పందించింది. ఈ నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. రిజర్వేషన్ నిబంధనలు పాటించట్లేదని, చట్టంలో లేని పోస్టులను భర్తీ చేస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లో అకడమిక్ కన్సల్టెంట్ల నియామకం (2025-26)పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో తాత్కాలికంగా పోస్టులు భర్తీ చేయడాన్ని న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం తప్పుబట్టింది. విద్యాసంస్థలను అడ్డాకూలీల కేంద్రాలుగా మార్చడాన్ని, విద్యావ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ నియామకాల విషయంలో పూర్తి వివరాలతో కోర్టులో కౌంటర్ వేయాలని ప్రభుత్వం, ఎస్వీయూ అధికారులను ఆదేశించింది ధర్మాసనం.
తాత్కాలిక నియామకాలతో యువతను దోచుకుంటున్నారని, నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని హైకోర్టు High Court ప్రశ్నించింది. నాణ్యమైన విద్య పొందడం విద్యార్థుల హక్కు అని, అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులు చట్టంలో లేవని పేర్కొంది. విభాగాల వారీగా పోస్టుల భర్తీలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, ఆ విధానాన్ని పాటించట్లేదని వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ, పోస్టుల భర్తీ విషయంలో ముందుకెళ్లకుండా న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అకడమిక్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీ ప్రక్రియపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో అకడమిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ కె. కిశోర్కుమార్రెడ్డి, మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. నెలవారీ గౌరవవేతనం ప్రాతిపదికన.. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు విరుద్ధంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారని ఆఱోపించారు. హైకోర్టు సింగిల్ జడ్జి వీరి అభ్యర్థనను తిరస్కరించడంతో ధర్మాసనం దగ్గర అప్పీల్ చేయగా విచారణ జరిపింది.. స్టే విధించింది. తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీని తప్పుబడుతూ.. భర్తీ ప్రక్రియపై స్టే ఇవ్వొద్దన్న ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యర్థనను తోసిపుచ్చింది. విశ్వవిద్యాలయం అక్టోబర్ 31న ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని చూస్తోంది. అయితే, ఈ భర్తీ ప్రక్రియలో రిజర్వేషన్ నిబంధనలను పాటించడం లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ పోస్టులకు నెలవారీ గౌరవవేతనం మాత్రమే ఇస్తున్నారని, ఇది శాశ్వత నియామకాలకు విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఏపీ హైకోర్టు స్టే విధించింది.
