CM Jagan: అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68వేల 990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే గత 55 నెలల్లో డీబీటీ రూపంలో 2లక్షల 46వేల 551 కోట్ల రూపాయల పథకాలను లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది.
చిట్ట చివరి వరకు లబ్ధిదారునికి అర్హతయితే చాలు ప్రభుత్వ పథకం అందాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. వివిధ జిల్లాలో ఇలా లబ్ధి పొందిన వారితో ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు.
పథకాలు అందని తమలాంటి వారికి తిరిగి మరో అవకాశం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలతో సంక్షేమ పథకాలు మిస్ అయిన తమకు మళ్లీ తిరిగి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, గతంలో ఎవ్వరూ ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వలేదని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.