ఏపీ లో రెవెన్యూ కుంభకోణం బయటపడింది. భూముల రికార్డులను తారుమారు చేసిన 38 మంది అధికారులపై ఏపీ సర్కార్ వేటు వేసింది. వెబ్ ల్యాండ్ పోర్టల్ లో భూ రికార్డులను టాంపరింగ్ చేసినట్టు రెవెన్యూశాఖ గుర్తించింది. గత నాలుగు నెలలుగా 38 మంది అధికారులు భూ రికార్డులను తారుమారు చేశారని సర్కార్ నిర్థారించింది. డిజిటల్ను దుర్వినియోగం చేసిన తహశీల్దార్లపై చర్యలు తీసుకున్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు గ్రామ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు వాళ్లకు నోటీసులు పంపారు. ఈ ఉత్తర్వులు గోప్యంగా ఉన్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
38 మంది అధికారుల్లో 11 మంది తహశీల్దార్లు ఉన్నారు. తీవ్రమైన అక్రమాలకు పాల్పడిన కడప జిల్లాకు ఒక తహవీల్దార్ ను, చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దర్నీ డిస్మిస్ చేయడం జరిగింది. సర్వీసు నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పనిచేస్తోన్న ఎనిమిది మంది తహశీల్దార్లు తొలగించారు. నెల్లూరు, ఇతర జిల్లాలకు చెందిన వాళ్లను సస్పెండ్ చేశారు.
ఖాతాలలో అసలు హక్కుదారుల పేర్లు తొలగించడం, అసైన్డ్ భూములను ఇతరుల పేర్లను చేర్చడం వంటి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. ప్రభుత్వ భూమిని రక్షించకుండా ఏకపక్ష సవరణలు చేయడం ద్వారా
ప్రైవేట్ భూముల ఖాతాల్లోకి మార్చారు. అక్రమాలకు పాల్పడిన వాళ్లలో ఆరుగురు తహశీల్దార్లను దిగువ స్థాయి ఆర్ ఐ పోస్టులకు పంపారు. ఆరుగురి తహశీల్దార్లలో ముగ్గురు అనంతపురం జిల్లాలో, ఒకరు చిత్తూరులో ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ తహశీల్దార్ ఉన్నారు. వాళ్లను తక్కువ ర్యాంక్కు శాశ్వత రివర్షన్ ఇవ్వబడింది. ఇక వాళ్లకు అధికారికి ఎలాంటి పదోన్నతి లభించదు. పదవీ విరమణ వరకు ఆ పదవిలో కొనసాగుతారు. అలాగే 12 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పీలేరు భూమి కేసులో వీరు ఇద్దరు తహశీల్దార్లు, ఇద్దరు ఆర్ఐలు, 8 మంది వీఆర్వోలు ఉన్నారు. 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎనిమిది జిల్లాల్లో మరింత మంది తహశీల్దార్లు విచారణను ఎదుర్కొంటున్నారు.