Durga Temple : ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేసిన అధికారులు

భారీ వ‌ర్షాల దృష్ట్యా విజ‌య‌వాడ‌లోని కనకదుర్గ అమ్మ‌వారి ఆలయ ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఇంద్రకీలాద్రి

  • Written By:
  • Updated On - December 6, 2023 / 07:51 AM IST

భారీ వ‌ర్షాల దృష్ట్యా విజ‌య‌వాడ‌లోని కనకదుర్గ అమ్మ‌వారి ఆలయ ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఇంద్రకీలాద్రి కొండపై నుంచి బండరాళ్లు ప‌డిపోయే అవ‌కాశం ఉండ‌టంతో ముంద‌స్తుగా ఘాట్ రోడ్డును మూసివేశారు. మంగళవారం నుంచి ఘాట్‌రోడ్డులో దుర్గ‌గుడిపైకి వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు ఆలయ కమిటీ, అధికారులు తెలిపారు. అలాగే భక్తులు మల్లిఖార్జున మహా మండపం మార్గాన్ని వినియోగించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. వర్షం తగ్గిన తర్వాత వాహనాల రాకపోకలకు వీలుగా దుర్గాఘాట్‌ రోడ్డును పునరుద్ధరించనున్నారు. ఇదిలా ఉండగా వర్షపు నీరు రోడ్లు, వీధుల్లోకి నీరు ప్రవహించకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ డ్రెయిన్‌లోని చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించే చర్యలను ప్రారంభించింది. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ పుండ్కర్ డ్రైనేజీ పాయింట్లను పరిశీలించారు. కండ్రిక జంక్షన్‌లోని డ్రైన్‌లలో చెత్తను తొలగించేందుకు మట్టి తవ్వకాలు, క్రేన్‌ల ద్వారా జరుగుతున్న పనులపై దృష్టి సారించారు.

We’re now on WhatsApp. Click to Join.

నీరు నిలిచిపోకుండా తొమ్మిది పాయింట్ల వద్ద క్రేన్‌లను ఏర్పాటు చేసినట్లు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పుండ్కర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన కోరారు. వరదనీరు వెళ్లేందుకు పుల్లేటి కాలవ, ఈఎస్‌ఐ హాస్పిటల్ జంక్షన్ గుణదల వంటి కీలక ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రోడ్లపై నీరు త్వరగా వెళ్లేలా ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. మిచాంగ్ తుపాను ధాటికి విజయవాడలోని భానునగర్‌లో మంగళవారం నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలోని ఐర‌న్ రాడ్లు ప‌డిపోవ‌డంతో మూడు ఇళ్లు దెబ్బతిన్నాయి. మూడు ఇళ్లలో ఉన్నవారు బయటకు వచ్చి త‌మ ప్రాణాల‌ను కాపాడుకున్నారు. సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు, ఇతర నాయకులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బహుళ అంతస్తుల యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read:  Revanth Reddy : రేవంత్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపిన హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ