Site icon HashtagU Telugu

Viveka Murder Case: వివేకా హత్యా కేసులో గజ్జల ఉమాశంకర రెడ్డి బెయిల్ పై తీర్పు వాయిదా!

Viveka Murder Case

Viveka Murder Case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో గజ్జల ఉమాశంకరరెడ్డి కీలక పాత్ర పోషించాడని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు వెల్లడించింది. సర్పంచి ఎన్నికల విషయంలో సహకరించకపోవడంతో ఉమాశంకరరెడ్డి కక్ష పెంచుకున్నట్లు, ఆయన హత్య పథకంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా, ఆ ఘటనలో పాల్గొని వివేకాపై దాడి చేసినట్టు పేర్కొంది.

నిందితులకు బెయిల్ మంజూరు చేయరాదని, జైలులో ఉన్నందున వారికి బెయిల్ మంజూరు చేయడం సరైనది కాదని, బెయిల్ మంజూరు చేయడానికి తగిన కారణాలను చూపాల్సిన అవసరం ఉందని సీబీఐ తరుపు న్యాయవాది తెలిపారు.

ఈ కేసులో మూడో నిందితుడైన ఉమాశంకరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ కె. లక్ష్మణ్ మంగళవారం విచారణ ప్రారంభించారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఉమాశంకరరెడ్డిని గుర్తించినట్లు వాచ్‌మన్ రంగన్న మూడు సార్లు వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు. అయితే, ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని భిన్నతలు ఉన్నాయి.

హత్య అనంతరం ఉమాశంకరరెడ్డి ద్విచక్రవాహనంపై వచ్చారని, రెండో నిందితుడు సునీల్ యాదవ్ నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చాడని న్యాయవాది వెల్లడించారు. కానీ, ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో పిటిషనర్ లేరని పేర్కొన్నారు.

దస్తగిరి వాంగ్మూలంలో గంగిరెడ్డి తలుపు తీసి సహకరించారని చెప్పారు, కానీ వాటిని బలవంతంగా తొలగించినట్లు ఉందని, అందువల్ల ఆ వాంగ్మూలంపై ఆధారపడకూడదని కోర్టుకు తెలియజేశారు. సాక్ష్యాల తారుమారుకు ఆస్కారం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

గొడ్డలితో వివేకా నుదుటిపై కొట్టినట్లు సీబీఐ తరఫు న్యాయవాది అనిల్ తల్వార్ కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు న్యాయవాది ఎస్. గౌతం వాదనలు వినిపిస్తూ, రెండో నిందితుడు సునీల్ యాదవ్ ఉమాశంకరరెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడని పేర్కొన్నారు. వీడియో ఫుటేజీలో దీనికి సంబంధించి సాంకేతిక ఆధారాలు లభించాయని వెల్లడించారు.

“డాగ్ స్క్వాడ్ వచ్చిన దాని కంటే ముందే, ఉదయం 5 గంటలకు స్థానిక పోలీసులు వివేకా ఇంటికి వెళ్లారు. తలుపు లాక్ దెబ్బతిన్నట్లుగా ఏమీ లేదు. గంగిరెడ్డి తలుపు తెరిచి నిందితులకు సహకరించాడు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, ఉమాశంకరరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయన దస్తగిరి నుంచి గొడ్డలి తీసుకుని వివేకా నుదుటిపై కొట్టాడు. రక్తపు మడుగులో ఉన్న వివేకాను బాత్‌రూంలోకి లాక్కెళ్లారు. సర్పంచి ఎన్నికలో తనకు సహకరించాలని వివేకా తిరస్కరించడంతో ఉమాశంకరరెడ్డి కక్ష పెంచుకుని హత్యకు పాల్పడ్డారు,” అని న్యాయవాది వివరించారు.

“హత్య జరిగిన రోజు వివేకా హైదరాబాద్ రావాల్సి ఉంది, కానీ ముఖ్యమైన వ్యవహారం ఉందంటూ గంగిరెడ్డితో కలిసి ఆయనను అడ్డుకున్నారు. ఉమాశంకరరెడ్డే వజ్రాల వ్యాపారం పేరుతో సునీల్ యాదవ్‌ను వివేకాకు పరిచయం చేశాడు. గంగిరెడ్డి, సునీల్ యాదవ్‌లతో కలిసి ముందుగా వివేకా కుక్కను చంపారు. దస్తగిరి వాంగ్మూలాలను సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరించింది, కాబట్టి వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఉమాశంకరరెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి,” అని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

Exit mobile version