జనసేన ఆవిర్భావ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. పవన్ పార్టీ ఎవరికోసం పెట్టారో నిన్న జరిగిన ఆవిర్భావ సభతో క్లారిటీ వచ్చిందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ను ప్రజలు చిత్తుగా ఓడించారని, అయినా ఆయనకు సిగ్గురాలేదని వెల్లంపల్లి మండిపడ్డారు. పవన్కు మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు.
అధికార వైసీపీ పై ఉన్న ప్రజా వ్యతిరేక ఓట్లు పక్కకి పోనివ్వనంటూ, సభలో చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని పరోక్షంగా తేల్చేసిన పనన్, బీజేపీ నాయకులు ఇచ్చే రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని పవన్ అన్నారు. మరి పవన్ కళ్యాణ్ సొంతగా ఏం చేస్తారని వెల్లంపల్లి ప్రశ్నించారు. పార్టీ పెట్టి ప్యాకేజ్ స్టార్గా మారిన పవన్ ఇప్పటికైనా మారతాడని ప్రజలు ఆశించి సభకు వెళ్ళగా, పవన్ ప్రసంగం విన్న తర్వాత వారు నిరాశ చెందారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి పై సోనియా గాంధీ ఎన్నో అక్రమ కేసులు పెట్టి హింసించినా, తట్టుకున్న జగన్ ఒంటిరిగా నిలబడి, సింగిల్ హ్యాండ్తో వైసీపీని అధికారంలోకి తెచ్చారని, ఎవరు ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ఆ పార్టీ కొమ్ముకాసే నువ్వు జగన్ పై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని వెల్లంపల్లి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు భజన చేసేందుకే నిన్న జనసేన ఆవిర్భావ సభ జరిగిందని వెల్లంపల్లి ఆరోపించారు.
నీ పంచ్ డైలాగులు సినిమాల్లో పనికొస్తాయేమో గానీ రాజకీయాల్లో పనికిరావని వెల్లంపల్లి అన్నారు. వ్యక్తిగత విషయాల పై వైసీపీ నాయకులు వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ తట్టుకోలేరని వెల్లంపల్లి అన్నారు. విగ్రహాల గురించి మాట్లాడే ముందు జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు ఉన్నపుడు విజయవాడలో దేవాలయంని ప్రభుత్వం కూల్చితే గాడిదలు కాసావా, లేక పందుల దొడ్లో పడుకున్నావా, నాడు రధం తగలబడితే ఏం చేసావు అని వెల్లంపల్లి ప్రశ్నించారు.
ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి ఊసరవెల్లిని ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండని, ఆయన మాట్లాడే మాటల్ని, రాష్ట్ర ప్రజలు కామెడీగా తీసుకుంటున్నారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో డిపాజిట్లు కోల్పోయి చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబులకు వైసీపీ గురించి మాట్లాడే అర్హత ఉందా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఇకముందు వైసీపీ నాయకులను బెదిరిస్తే ఏపీలో తిరగలేవు ఖబర్దార్ అంటూ పవన్కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి వెల్లంపల్లి వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.