బెజవాడలో వంగవీటి కుటుంబం చుట్టూ రాజకీయం నడుస్తుంది. దివంగత నేత వంగవీటి మోహన రంగా వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు వంగవీటి అభిమానులు ప్లాన్ చేశారు. అయితే ఇటు రాజకీయ పార్టీలు కూడా ఆయన వర్థంతి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీలు రంగా వర్థంతి కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహిస్తున్నారు. నిన్న(ఆదివారం) రాత్రి నున్నలో జరిగిన వంగవీటీ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధతో పాటు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. అయితే ఈ రోజు(సోమవారం) టీడీపీ, జనసేన నేతలతో కలిసి వంగవీటి రాధ.. రంగా విగ్రహానికి నివాళ్లు అర్పించారు. ఇటు గుడివాడలో సైతం పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. నిన్న రాత్రి వైసీపీ నేతలు టీడీపీ నాయకులపై దాడికి యత్నించారు. రంగా వర్థంతి కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఎవరూ నిర్వహించవద్దంటూ వైసీపీ నాయకులు హుకుం జారీ చేశారు. అయితే టీడీపీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో రంగా వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని సవాల్ చేశారు. ప్రస్తుతం గుడివాడలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.