Joel Reefman : ఆంధ్రా, అమెరికా అనుబంధం

వైద్య, ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా అరికట్టడంలో ఏపీని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జోయెల్ రీఫ్మాన్ ప్రశంసించారు.

Published By: HashtagU Telugu Desk
Joel Reefman

Joel Reefman

వైద్య, ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా అరికట్టడంలో ఏపీని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జోయెల్ రీఫ్మాన్ ప్రశంసించారు. విద్యావ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలను కొనియాడారు. సీఎం క్యాంపు కార్యాలయంలో రైఫ్‌మెన్‌తో సమావేశమై సీఎం పలు అంశాలపై చర్చించారు. అమెరికా-ఆంధ్రా మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో అమెరికా కాన్సులేట్‌కు సహకారం అందించ‌డానికి చొరవ చూపిన‌ సిఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం, అమెరికన్ కాన్సులేట్ మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు సీఎం చేస్తున్న కృషిని కొనియాడారు. పునరుత్పాదక ఇంధనం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఆంధ్రా-అమెరికన్ పెట్టుబడులు, పరిశ్రమలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు.

దేశంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా నిలిచేందుకు విశాఖపట్నంకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని జోయెల్ రీఫ్‌మన్ ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు 50 శాతం ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, పాఠశాల విద్యపై సీఎం ప్రోత్సాహక చర్యలను జోయెల్ రీఫ్‌మన్ ప్రశంసించారు. విశాఖపట్నంలో అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించడంలో అమెరికా కాన్సులేట్ జనరల్‌కు సహకరించినందుకు సీఎం జగన్‌కు రీఫ్‌మన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, దాని పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రా-అమెరికా సంబంధాలపై సీఎం జగన్ ప్రత్యేక చొరవ చూపారని, మూడేళ్ల పదవీకాలంలో నాలుగుసార్లు సీఎంతో పలు అంశాలపై చర్చించే అవకాశం కల్పించారని కొనియాడారు. ఈ సమావేశంలో సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ ఎం.హరికృష్ణ పాల్గొన్నారు.

  Last Updated: 18 May 2022, 12:33 PM IST