కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 8న ఆయన రాయలసీమలో పర్యటించాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ రోజు కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నెల మూడో వారంలో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కు వస్తారని, త్వరలోనే పర్యటన తేదీని ఖరారు చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఈనెల 8వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించాల్సి ఉండగా, ఈ పర్యటన వాయిదా పడినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 8వ తేదీన కర్నూలు జిల్లాకు వస్తారని, కర్నూలు నుండి సత్యసాయి జిల్లా వెళ్లి బాబా సమాధిని సందర్శించుకొని అక్కడి నుండి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లవలసి ఉన్నది. కానీ.. అనుకోకుండా ఈ పర్యటన వాయిదా పడింది. పర్యటన వాయిదాకు గల కారణాలను అధికారులు వెళ్లడించలేదు. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర నాయకత్వం కృష్టి చేస్తున్నది.
Also Read: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై మళ్లీ రాళ్ల దాడి.. ఈసారి ఎక్కడంటే..?
ఇందులో భాగంగానే షా రాష్ట్రానికి రానున్నారని సమాచారం. ఎన్నికలకు ఏదాదిన్నర సమయం ఉండటంతో ఇప్పటి నుండే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందు క్షేత్రస్థాయిలో బలంగా, బూత్ స్థాయిలో పార్టీని నిర్మిస్తే ఎన్నికల నాటికి కొంతమేర పోటీకి అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో జనసేన పార్టీతో పొత్తు ఉన్నది. అయితే, తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నది. దీనిపైనే ప్రస్తుతం సందిగ్ధత నెలకొన్నది. ఎన్నికలకు సమయం ఉండటంతో పొత్తుల విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. పర్యటన తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడిందని, ఈనెల మూడో వారంలో అమిత్ షా రాష్ట్రానికి రానున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.